యాదాద్రి, జూలై 31 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శ్రావణ మాసంతో పాటు ఆదివారం కావడంతో భక్తుల సందడి నెలకొంది. ఉదయం తెల్లవారుజూము నుంచి రాత్రి వరకు స్వామికి నిర్వహించిన వివిధ రకాల ఆర్జిత, విశేష పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. పూజల అనంతరం స్వామిని దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.
శ్రావణ మాసం కావడంతో కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ స్వామి వత్రాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. సుమారు 26వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అంతకుముందు నారసింహుడికి నిత్యపూజలు అర్చకులు ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. స్వామి ఖజానాకు రూ.28,30,828 ఆదాయం సమకూరిందని ఈఓ గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునః ప్రారంభం అనంతరం జరిగే శ్రావణమాస వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయాధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే శ్రావణమాస మొదటి శుక్రవారం రోజు ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’ ప్రారంభించగా ఈ నెల 27వ తేదీ వరకు పూజలు కొనసాగనున్నాయి. దీంతో పాటు ఈ నెల 30న ప్రారంభమైన ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు నేటితో ముగింపు పలుకనున్నారు.
ఆగస్టు 2వ తేదీ నాగపంచమి, 5వ తేదీన వరలక్ష్మి వ్రతం, 7నుంచి 9వ తేదీ వరకు స్వామి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సర్వదోషాలు తొలగిపోవడానికి నాలుగు చతుర్వేద పారాయణాలు, మూలమంత్ర హవనాలతో 108రకాల నూలు పోగులకు ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. 12వ తేదీన రాఖీ పౌర్ణమి వేడుకులు జరుగుతాయి. 20వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీ కణ్ణన్ తిరునక్షత్రోత్సవాలు చేపట్టనున్నారు.
శ్రావణమాసం సందర్భంగా యాదాద్రిలో ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’ కార్యక్రమం మూడో రోజుకు చేరింది. రూ.2వేల టికెట్ తీసుకున్న భక్తుల పేరిట అర్చకులు సంకల్పం చేశారు. 30మంది రుత్వికులు అమ్మవారి సహస్రనామాలు పఠించారు. ఆండాళ్ అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు రెండో రోజుకు చేరాయి. ఆదివారం ఉదయం అమ్మవారికి నవకలశాభిషేకం, దివ్యప్రబంధ పాశురాలను రుత్వికులు పఠించారు. సాయంత్రం అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి తిరువీధి సేవ చేశారు.
సనాతన ధర్మాన్ని శాస్త్ర ప్రమాణాల్లో పాటించే సీఎం కేసీఆర్ మహాసంకల్పం యాదాద్రి క్షేత్రంలో అడుగడుగునా అద్భుతంగా దర్శనమిస్తున్నదని ప్రముఖ రచయిత, శ్రీశైలం దేవస్థాన పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రచించిన ‘శ్రీ పూర్ణిమ’ ప్రత్యేక మహా గ్రంథాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులకు అందించారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుక్కింగ్ ద్వారా 2,15,350
వీఐపీ దర్శనాలు 3,30,000
వేద ఆశీర్వచనం 21,000
నిత్య కైంకర్యాలు 4,801
సుప్రభాతం 9,400
క్యారీబ్యాగుల విక్రయం 20,350
వ్రత పూజలు 1,58,400
కళ్యాణకట్ట టిక్కెట్లు 45,200
ప్రసాద విక్రయం 13,06,970
వాహనపూజలు 18,900
శాశ్వత పూజలు 37,500
అన్నదాన విరాళం 83,938
సువర్ణ పుష్పార్చన 1,57,824
యాదరుషి నిలయం 1,00,430
పాతగుట్ట నుంచి 31,420
కొండపైకి వాహన ప్రవేశం 2,75,000
లక్ష్మీ పుష్కరిణి 800
శివాలయం 3,700