గ్రామీణ మహిళల స్వయం ఉపాధికి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేయూత ఇస్తున్నది. వ్యవసాయంలోనే కాదు.. వ్యాపారంలో రాణించేలా మహిళా సంఘాలకు విరివిగా రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఆ రుణాలను సద్వినియోగం చేసుకున్న అనేక మంది మహిళలు ఆయా రంగాల్లో రాణిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు.
– మిర్యాలగూడ రూరల్, సెప్టెంబర్ 10
మిర్యాలగూడ మండలంలో 1,198 సమభావన సంఘాలు ఉన్నాయి. అందులో 12వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మండలంలో సెర్ప్లో ఇద్దరు ఏపీఎంలు, 8 మంది సీసీలు పని చేస్తున్నారు. వారు మండలంలోని 46 గ్రామ పంచాయతీలు, ఆవాసాల్లో తిరిగి మహిళలను చైతన్యపరిచి సంఘాలుగా ఏర్పరిచారు. వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్చించి స్వయం ఉపాధి కల్పనకు అవకాశం కల్పించారు. బ్యాంకు నుంచి రుణం పొందడం సులభం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపుతున్నారు.
మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పరుచుకునేందుకు మిర్యాలగూడ మండలానికి రూ.54.96 కోట్లు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 495 సంఘాలకు రూ.27.07 కోట్ల రుణాలను అందజేశారు. ఇందులో ఇప్పటివరకు 273 సంఘాల మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో మహిళా సంఘాల సభ్యులు డెయిరీ ఫామ్లు, ఫొటో స్టూడియోలు, జిరాక్స్, నెట్ సెంటర్లు, కుట్టు బోటింగ్, మినరల్ వాటర్ ప్లాంట్, స్వీట్ సెంటర్లు, కిరాణం, జనరల్ స్టోర్లు, క్లాత్ మ్యాచింగ్ సెంటర్లు, పిండి మిల్లు, చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకొని మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. దీంతో గ్రామాల్లో నిరుద్యోగ సమస్య కొంత తొలగిపోవడంతోపాటు ఆదాయం పెరిగి జీవన ప్రమాణం మెరుగు పడుతున్నది.
నేను గతంలో మా పొలంలో వ్యవసాయం పని చేసేది. ప్రభుత్వం, సెర్ప్ ఉద్యోగుల ప్రోత్సాహంతో బ్యాంకు నుంచి రూ.90 వేల రుణం తీసుకున్నా. వాటికి నా సొంత డబ్బు రూ.30వేలు కలిపి ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ వర్క్ షాపు పెట్టా. నెలకు రూ.60వేల వ్యాపారం నడుస్తుంది. ఖర్చులు పోను రూ.30వేల వరకు మిగులుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులు మానేసి ఇంటి పట్టున ఉండి షాపు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నా.
– విజయ, కనకదుర్గ సమభావన సంఘం సభ్యురాలు, రుద్రారం, మిర్యాలగూడ
మండలం రూ.లక్ష లోన్ తీసుకొని కిరాణం షాపు పెట్టా ప్రభుత్వం బ్యాంకులకు లక్ష్యం పెట్టి సెర్ప్ ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతో వారు గ్రామాల్లో అర్హులైన మహిళలకు స్వయం ఉపాధి కోసం రుణాలు ఇస్తున్నారు. నేను మహిళా సంఘం ద్వారా బ్యాంకులో లక్ష రూపాయల లోన్ తీసుకున్న. మరో రూ.20వేలు కలిపి కిరాణం మరియు చీరెల షాపు పెట్టా. రోజుకు 2వేల నుంచి రూ.3వేల వ్యాపారం నడుస్తుంది. నెలకు ఖర్చులు పోను రూ.15 వేల ఆదాయం వస్తుంది. ఏ ఒత్తిడి లేకుండా వ్యాపారం హాయిగా సాగుతుంది. దాంతో నా పిల్లలను మంచిగా చదివించుకుంటున్నా.
– తక్కెళ్ల రాజేశ్వరి, రమ్య సమభావన సంఘం సభ్యురాలు, తుంగపహాడ్, మిర్యాలగూడ మండలం