నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, మునుగోడు (అక్టోబరు 26) : సీఎం కేసీఆర్పైన, టీఆర్ఎస్పైన, తెలంగాణపైన కుట్రలు బీజేపీని తెలంగాణ సమాజం కూకటివేళ్లతో సహా పెకిలించాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర బట్టయబలైన తర్వాత.. మునుగోడులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్టాడారు. బీఆర్ఎస్ను చూస్తే బీజేపీకి వణుకు మొదలైందని, అందుకే టార్గెట్ చేస్తూ చిల్లర రాజకీయాలకు దిగుతున్నదని విమర్శించారు. మునుగోడు ఎన్నికల్లో పోలీసు తనిఖీల్లో బీజేపీ నేతల దగ్గర నోట్ల కట్టలు దొరకుతున్నాయని, మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులు తెచ్చి పెట్టారని సుమన్ విమర్శించారు. ఎన్నికల సంఘం బీజేపీకి జేబు సంస్థగా మారిపోయిందన్నారు. బీజేపీ నేతలు అడ్డదారుల్లో టీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని డబ్బు, పదవులు ఎరవేస్తూ, కాంట్రాకులు ఇస్తామని ఆశపెడుతున్న బీజేపీ బండారాన్ని తమ పార్టీ బట్టబయలు చేశారని సుమన్ అన్నారు.