ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2023కి చిన్నాపెద్ద అట్టహాసంగా స్వాగతం పలికారు. కేక్లు కట్ చేసి నోరు తీపి చేసుకున్నారు. అలయ్ బలయ్తో శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. డిసెంబర్ 31 రాత్రి హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు, బార్లు కిక్కిరిసిపోయాయి. కోట్ల రూపాయల నోట్ల కట్టలు ఖర్చయ్యాయి. అర్ధరాత్రి 12 దాటగానే యువత బైక్లతో రోడ్లపైకి వచ్చి న్యూ ఇయర్ విషెస్తో హోరెత్తించింది. మరోవైపు నూతన సంవత్సర వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఉదయం ఆరున్నర గంటల నుంచే స్వయంభువు దర్శనం ప్రారంభం కానున్నది. ఉమ్మడి జిల్లా ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలు తీసుకోబోయే నిర్ణయాలు వారి అభ్యున్నతికి దోహదపడాలని మంత్రి జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. ప్రజావసరాలకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించి సుభిక్షమైన పాలన అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని, అదే ఒరవడితో నూతన ంవత్సరంలోనూ సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో కొనసాగుతాయని పేర్కొన్నారు.
రామగిరి, డిసెంబర్ 31 : గడిచిపోయిన ఏడాదికి వీడ్కోలు చెపుతూ.. కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి ఉమ్మడి జిల్లా ఘనంగా స్వాగతం పలికింది. 2022లో జరిగిన మంచీ చెడులను నెమరు వేసుకుంటూ.. 2023లోకి జనం అడుగు పెట్టారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా.. ఆడ, మగ బేధం లేకుండా ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. యువత ఫుల్ జోష్తో సంబురాల నడుమ కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు సైతం పలుచోట్ల న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఏడాది చివరి రోజున మద్యం, మాంసం విక్రయాలు జోరుగా సాగాయి. మద్యం, మాంసం దుకాణాలు, బేకరీలు, స్వీట్ షాపులు శనివారం మధ్యాహ్నం నుంచే కిక్కిరిసిపోయాయి. కాలనీలు, అపార్టుమెంట్లలో న్యూ ఇయర్ సంబురాలు అంబరాన్నంటాయి. ఆయా ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పండుగ వాతావరణం కనిపించింది. ఇండ్ల ముంగిళ్లలో వేసిన రంగవల్లులు అబ్బురపరిచాయి. పటాకుల వెలుగులు విరజిమ్మాయి. నల్లగొండ పట్టణంలోని పలు చర్చిల్లో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఉమ్మడి ప్రజలకు మండలి చైర్మన్ గుత్తా శుభాకాంక్షలు
రామగిరి, డిసెంబర్ 31 : రాష్ట్ర ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023లో ఉమ్మడి జిల్లా ప్రజలంతా తాము ఎంచుకున్న వివిధ రంగాల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. నూతన ఆలోచనలతో, పట్టుదలతో, కొత్త ఉత్సాహంతో న్యూ ఇయర్లో రాణించాలని కోరారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని గుత్తా సుఖేందర్రెడ్డి ప్రజలకు సూచించారు.
ప్రజా సుభిక్షమే సీఎం కేసీఆర్ సంకల్పం
సూర్యాపేట టౌన్, డిసెంబర్ 31 : యావత్ తెలంగాణ సమాజం సుభిక్షంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అందుకనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసి విజయవంతం అయ్యిందని పేర్కొన్నారు. 2023కు స్వాగతం పలుకుతూ ఆయన ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఎజెండాను 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ అమలు పరిచారని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజల ఆకాంక్షలకు తగిన ప్రణాళికలు రూపొందించి సుభిక్షమైన పాలనను అందించి కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. అదే ఒరవడితో నూతన సంవత్సరంలోనూ సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా నిర్ణయాలు ఉంటాయని హామీ ఇచ్చారు. అదే సమయంలో ప్రజలు నూతన సంవంత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు వారి అభ్యున్నతికి దోహదపడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.