అర్వపల్లి, మే 17 : చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తారని, ఎక్కడైనా తడిసిన ధాన్యం ఉంటే వాటిని కూడా కొనుగోలు చేయిస్తామని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. మండలంలోని కొమ్మాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాయిల్ రైస్ మిల్లులకు అందజేయాలని తాసీల్దార్ డీఎస్ఓకు సూచించారు. జాజిరెడ్డిగూడెంలో మొత్తం 24సెంటర్లకు 20 సెంటర్లలో ధాన్యం కొనుగోలు పూర్తయిందని 1 సెంటర్లోనే 4 లారీల ధాన్యం ఉందని తాసీల్దార్ శ్రీనివాసులు జిల్లా కలెక్టర్కు తెలిపారు. ఐకేపీ సెంటర్లో ధాన్యాన్ని రేపటికల్లా కొనుగోలు చేసి లారీల ద్వారా ఎగుమతి చేయాలని ఏపీఎం మల్లేశ్ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2,30,613 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లో రూ.367 కోట్లు జమ చేశామని తెలిపారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల పనులను తనిఖీ చేసి, జూన్ 5వరకు ఆన్లైన్ పూర్తి చేయాలని పీఆర్ఏఈ అశోక్ను ఆదేశించారు. పాఠశాలను ప్రారంభించిన తర్వాత విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా ఊపేక్షించేది లేదన్నారు. కాసర్లపహాడ్లో పల్లె దవాఖాన తనిఖీ చేసి తాళం వేసి ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది గైర్హాజరుపై ప్రజలను ఆరా తీసి తెలుసుకున్నారు. ఆశ వర్కర్ అన్నపూర్ణ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు దవాఖాన తెరిచిందని, డాక్టర్ గౌతమి గురించి ఆశ వర్కర్ను అడగగా అత్యవసరమై బ్యాంకుకు వెళ్లిందని తెలిపారు. విషయాన్ని ఫోన్ ద్వారా డీఎంహెచ్ఓకు తెలిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు పల్లె దవాఖానలో సిబ్బంది అందుబాటులో ఉండాలని, లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సందీప్కుమార్, ఏపీఎం మల్లేశ్, సెంటర్ ఇన్చార్జి యాదమ్మ, గ్రామ పంచాయతీ సెక్రటరీ మూర్తి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.