చిక్కడపల్లి, జనవరి 9 : ఆర్టీసీ ఉద్యోగులు, అద్దె బస్సు యజమానులు, ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ సంస్థలో నష్టాలను తగ్గించగలిగామని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళా భవన్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర అద్దె బస్సు యజమానుల సంక్షేమ సంఘ డైరీని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. అనంరతం చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ అద్దె బస్సు యజమానుల సమస్యలను గతంలోనే పరిష్కరించామన్నారు.
ఇతర సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని కూడా పరిష్కరి చేందుకు కృషి చేస్తామని తెలిపారు. కరోనా తర్వాత నష్టాలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రతి రోజూ రూ. 10 నుంచి రూ. 4 కోట్లకు నష్టాలను తగ్గించ కలిగామని ఆయన పేర్కొన్నారు. 50 వేల మంది ఉద్యోగులు ఉన్న అతిపెద్ద సంస్థ ఆర్టీసీ సంస్థ అని, వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని అద్దె బస్సు యాజమానుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రతి ఏటా రూ. 1500 కోట్లు ఇస్తూ సహకారం అందిస్తున్నారన్నారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ అందరి సహకారంతో నేడు ఆర్టీసీ సంస్థ అభివృద్ధి చెందుతున్నదన్నారు. కొవిడ్ కారణంగా అందరూ ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రజల ఆదరణ వలన, సంస్థలో తీసుకొచ్చిన సంస్కరణవలన నేడు ఆర్టీసీ పూర్వ వైభవం దిశగా అభివృద్ధి చెందుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఈడీలు పురుషోత్తం నాయక్, ముణిశేఖర్, వినోద్, రాష్ట్ర అద్దె బస్సు యజమానుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు మధూకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహిపాల్రెడ్డి, కోశాధికారి సత్యంబాబు, ఉపాధ్యక్షుడు రవి, సంయుక్త కార్యదర్శి మాధవ్రెడ్డి, అదనపు కార్యదర్శి జి.రామకృష్ణారెడ్డి, కార్యదర్శి బాలవర్ధన్రెడ్డి, బస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్ పాల్గొన్నారు.