రామగిరి, ఏప్రిల్ 24 : మహనీయుల చూపిన ప్రజ్ఞ, కరుణ, పోరాటాల బాటలో ముందుకు సాగాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఇటికాల పురుషోత్తం, తెలంగాణ ఆర్టీఐ కమిషనర్ శ్రీ దేశాల భూపాల్, ప్రొఫెసర్ మహమ్మద్ అబ్దుల్ మాలిక్ హాజరై త్యాగదనుల సేవలను కొనియాడుతూ విద్యార్థులకు కర్తవ్య బోధ చేశారు. ఈ సందర్భంగా ఆచార్య ఇటికాల పురుషోత్తం మాట్లాడుతూ.. విద్య ద్వారా సంక్లిష్టతలకు సమాధానాలు, సన్మార్గానికి, సామరస్యతలకు బాటలు వేస్తుందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని, విద్యను సాధనంగా భావించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యా ద్వారా పరిపూర్ణమైన మార్పుతో పాటు ప్రపంచాన్ని పరిచయం చేసి ముందుకు నడిపించే సాధనంగా కీర్తించారు. సదాశయంతో మంచి దృక్పథంతో ప్రణాళికతో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరు అనడానికి మహనీయుల జీవితాలే సాక్ష్యం అన్నారు. వారి అడుగుజాడల్లో పయనించి దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలని సూచించారు. ప్రజ్ఞ, కరుణ, పోరాటాల బాటలు భావితరాలకు స్ఫూర్తి అన్నారు.

మహనీయుల ఆశయాల సాధనలో ముందుకు సాగాలి : ఆచార్య ఇటికాల పురుషోత్తం
ఆర్టీఐ కమిషనర్ శ్రీ దేశాల భూపాల్ మాట్లాడుతూ.. జీవితంలోని సవాళ్లను స్వీకరించి, నైరాశ్యానికి తావు లేకుండా అంచెలంచలుగా తమను తాను మలుచుకుని కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన పూలే, అంబేద్కర్ మహనీయుల జీవితాలు ఆదర్శమన్నారు. అనంతరం ఆచార్య అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ.. మహనీయుల రచనలు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నాయకులను తీర్చేదిద్దాయని, సత్యశోధనకు అధ్యయనమే ఏకైక మార్గమన్నారు. కార్యక్రమంలో కళాకారుడు రేలారే ప్రసాద్ తన పాట మాటతో విద్యార్థులను అలరించారు. రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆచార్య సరిత, ఆచార్య అలువాల రవి, డా.రవితేజ, ఆచార్య వసంత, డా.అరుణప్రియ, డా.ప్రేమ్ సాగర్, డా.మద్దిలేటి, డా.జ్యోతి, డా.సబీనా హెరాల్డ్, డా.హరీష్ కుమార్, డా.దోమల రమేష్, డా.మిరియాల రమేష్ పాల్గొన్నారు.