– సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నల్లగొండ, ఏప్రిల్ 09 : ఆదర్శ ప్రజా నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో అమరజీవి నర్రా రాఘవరెడ్డి 11వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో గోరంగా వైఫల్యం చెందారని, కేంద్ర ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన భారాలను మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు. నేటి పాలకులు చట్ట సభలలో ప్రజా సమస్యలను చర్చించకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారన్నారు. కేరళ రాష్ట్రంలో ఎల్డీఎఫ్ కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, వామపక్ష ప్రభుత్వం పైన యతి ప్రాస కోసం చేసే విమర్శలను తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు.
కేరళ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగా అభివృద్ధి చేసిన ఘనత వామపక్ష ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బడే బాయ్, చోటా బాయ్ మోదీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కమ్యూనిస్టుల పైన విమర్శలు చేయడాన్ని కేరళ రాష్ట్ర ప్రజలు సహించరన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నాయని దుయ్యబట్టారు. రేషన్ కార్డులు, అన్ని రకాల పెన్షన్లు, ఇండ్లు ఇండ్ల స్థలాలు ఎప్పటి వరకు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇస్తున్న సన్న బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను కూడా ఇవ్వాలన్నారు. యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలును వెంట వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫ్లోరైడ్ విముక్తి పోరాటంలో, ఎస్ఎల్బీసీ సొరంగంకై సాగిన పోరాటంలో నర్రా రాఘవ రెడ్డి ప్రముఖుడన్నారు. చట్ట సభలలో ఇప్పుడు జరుగుతున్న చర్చలు లాగా ఆరోజు లో లేవని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిర్భయంగా ఆ నిర్ణయాలను వెంటనే ఉప సంహరించుకోవాలని రాఘవరెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ విముక్తి చేయాలనే తపనతోనే ఎస్ఎల్బీసీ సొరంగం అయితే ఆలస్యం అవుతుందని నార్ల తాతారావును వెంటబెట్టుకుని ఎన్టీ రామారావు దగ్గరికి తీసుకెళ్లి లిఫ్ట్ ద్వారా పూర్తి చేయాలని సూచించారు. అందుకు అనుగుణంగానే నేటి ఎస్ఎల్బీసీ లిఫ్ట్ స్కీమ్ అని చెప్పారు. తన జీవితమంతా పోరాటాలతో, సమస్యలతో కూడుకున్నప్పటికీ వడిదొడుకులు లేకుండా నమ్ముకున్న ఆశయం కోసం తుదకంట నిలబడ్డారని కొనియాడారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గంలో ప్రతి పెద్ద ఊర్లో హైస్కూల్ నిర్మాణం చేయించారని, మంచినీటి సమస్య, ఆరోగ్య సమస్యలు లేకుండా చూశారని చెప్పారు. ఆరోగ్య సమస్యలతో నాయకత్వం గాని, ప్రజలు అనారోగ్యానికి గురి అయినప్పుడు స్వయంగా వెంటబెట్టుకుని వైద్యం చేయించే వారిని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను తన సమస్యగా అనుకొని వారి సమస్యను వెంటనే పరిష్కరించిన మహనీయుడు నర్రా రాఘవరెడ్డి అన్నారు. అమరజీవి నర్రా రాఘవరెడ్డి పేరుతో షుగర్, బిపి, ఫిట్స్, పక్షవాతం రోగులకు మందులు ఇస్తున్నామని చెప్పారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పాలడుగు నాగార్జున, సయ్యద్ హాషం, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు ప్రభావతి, ఎండి సలీం, నర్సిరెడ్డి, పి.వరలక్ష్మి, దండెంపల్లి సత్తయ్య, బాణాల పరిపూర్ణచారి, తుమ్మల పద్మ, అవుట రవీందర్, గాదె నరసింహ, బొల్లు రవీందర్, కండె యాదగిరి, పుష్పలత, కత్తుల యాదయ్య పాల్గొన్నారు.