కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వర్షాల్లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. నాగార్జునసాగర్ జలాశయం ప్రస్తుతం ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోనుండడంతో ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగికి నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోయిందని అధికార యంత్రాంగం చేస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 522.30 అడుగుల మేర మాత్రమే నీరుంది. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఎడమ కాల్వ మేజర్ల కింద 3,03,350 ఎకరాలు, 41 లిఫ్ట్ల కింద 90,912.. మొత్తం 3,94,262 ఎకరాల ఆయకట్టు ఉన్నది. కాగా.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఈ సీజన్లో బోరు, బావులే ఆధారం కానున్నాయి. అలా సుమారు 75వేల ఎకరాల్లో మాత్రమే రైతులు వరి సాగుకు సిద్ధమవుతుండగా.. నీటి ఆధారం లేని 3.19లక్షల ఎకరాలు పడావు పడనున్నాయి.
మిర్యాలగూడ/హాలియా, డిసెంబర్ 14 : కృష్ణా బేసిన్లో ఈ ఏడాది వర్షాలు అతి తక్కువగా కురువడంతో తెలంగాణ, ఆంధ్రా పరిధిలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీరు స్వల్పంగా చేరింది. దాంతో ప్రాజెక్టుల్లో సరిపడా నీరు లేకపోవడంతో సాగునీటి ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ కింద ఎడమ కాల్వకు నీరు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించే అవకాశం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మేజర్ల కింద 3,03,350 ఎకరాల ఆయకట్టు ఉండగా.. 41 ఎత్తిపోతల పథకాల కింద 90,912 ఎకరాలు ఉన్నది.
మొత్తం 3,94,265 ఎకరాలకు సాగునీరు అందేది. రెండు తెలుగు రాష్ర్టాల అవసరాల మేరకు 505 అడుగుల వరకు నీటిని వినియోగించుకునేందుకు ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో 510 అడుగుల కంటే నీటి మట్టం తగ్గితే హైదరాబాద్ ప్రజల కోసం అందించే తాగునీటిపై ప్రభావం చూపే పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా బేసిన్లో వర్షాలు తక్కువగా పడడంతో తెలుగు రాష్ర్టా పరిధిలోని ప్రాజెక్టులకు సుమారు 150 టీఎంసీల నీరు మాత్రమే ఇన్ఫ్లో వచ్చింది. భారీ ఇన్ఫ్లో ఉంటేనే రెండు తెలుగు రాష్ర్టాల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయి. ఆశించిన స్థాయిలో ఇన్ఫ్లో లేకపోవడంతో సాగునీటి అవసరాలను పక్కకు పెట్టారు. ఈ క్రమంలోనే సాగర్ ఎడమ కాల్వ కింద సాగునీటిని విడుదల చేయలేదు. యాసంగి వరిసాగుకు కూడా నీటి విడుదల పరిస్థితి లేకుండాపోయింది.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో బోర్లు, ఊట బావుల ద్వారా రైతులు సుమారు 75 వేల ఎకరాల్లో యాసంగి వరి సాగు చేస్తున్నారు అందుబాటులో ఉన్న నీటి వనరు ఆధారంగా స్వల్పకాలిక వరి వంగడాలను నాటు వేస్తున్నారు. ఆయకట్టుకు మూడు నెలలపాటు సరిపడా విద్యుత్ అందితేనే వరిసాగు గట్టెక్కనుంది.
నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో పదేండ్ల తరువాత రైతుల భూములు సుమారు 3.19 లక్షల ఎకరాలు బీళ్లుగా మారనున్నాయి. యాసంగి సీజన్లో కేవలం నీటి ఆధారంగానే మెట్ట పంటలైన వేరుశనగ, కంది, పెసర, మినుము వంటి పంటలు పండిస్తారు. సాగర్ ఆయకట్టులో ఈ పంటలు పండించేందుకు రైతులకు నీటి వసతి లేకపోవడంతో ఆయకట్టు పూర్తిగా బీళ్లుగా మారే పరిస్థితి ఉంది. ఆయకట్టులో కేవలం నీటి వసతి ఉన్న 75 వేల ఎకరాల్లో మాత్రమే వరిసాగు చేస్తున్నారు. 3.19 లక్షల ఎకరాల్లో నీటి వసతి లేకపోవడం వల్ల మెట్టపంటలు కానీ, వరి కానీ సేద్యం చేసే పరిస్థితి లేకుండా పోయింది.
ఆయకట్టు పరిధిలో రైతులు ఎక్కువగా వరిసాగు వైపు దృష్టి సారిస్తున్నారని, మెట్ట పంటలు సాగు చేస్తేనే ఎక్కువ మొత్తంలో భూమిలో పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కాగా, సాగర్ ఆయకట్టు పరిధిలో వరి మినహా ఇతర పంటలేవీ ఆశించిన స్థాయిలో గతంలో దిగుబడి రాకపోవడంతో నీటి వసతి ఉన్న రైతులు వరి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు.
నాగార్జునసాగర్ ఆయకట్టు వివరాలు ఉమ్మడి జిల్లా ఆయకట్టు – 3,03,353 ఎకరాలు 41 ఎత్తిపోతల ఆయకట్టు- 90,912 ఎకరాలు మొత్తం – 3,94,265 ఎకరాలు
నందికొండ : నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590(312.50 టీఎంసీలు) అడుగులకు గానూ గురువారం నాటికి 522.30 అడుగులకు చేరుకొని 153.5035 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నుంచి ఎస్ఎల్బీసీ ద్వారా 1,350 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్కు ఇన్ప్లో లేదు.