తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే చీకట్లు మాయమై వెలుగులు విరజిమ్ముతున్నాయని, సీఎం కేసీఆర్ విద్యుత్ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు ఇది నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నేడు అన్ని రంగాలు ప్రగతి పథంలో ముందుకు సాగడానికి విద్యుత్తే మూలమని, స్వరాష్ట్రంలో ఇది ప్రభుత్వం సాధించిన అద్భుత విజయమని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ విద్యుత్ విజయోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడితే చీకట్లో మగ్గుతారంటూ నాడు హేళన చేసిన నాయకులకు తెలంగాణలో అమలవుతున్న 24 గంటల కరెంటే చెంపపెట్టు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 7,778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉండగా నేడు 18,567 మెగావాట్లకు చేరుకుందని తెలిపారు. 2014కు ముందు ఎందుకు నిరంతర విద్యుత్ ఇవ్వలేక పోయారని, ఇప్పుడు ఎలా సాధ్యమైందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం విద్యుత్ ప్రగతి ఉత్సవాలను పండుగలా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు కరెంట్ వినియోగదారులు, సిబ్బంది పాల్గొన్నారు.
– చివ్వెంల, జూన్ 5
చివ్వెంల, జూన్ 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు 24 గంటల నిరంతర విద్యుతే నిదర్శనమని, విద్యుత్ వినియోగంలో మనమే మొదటి స్థానంలో ఉన్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జాతీయ తలసరి వినియోగంతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 69.40 శాతం విద్యుత్ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగంలో అద్భుత విజయాలు సృష్టించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో సోమవారం చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్లోని సబ్స్టేషన్ ప్రాంగణంలో విద్యుత్ విజయోత్సవాలపై నిర్వహించిన విద్యుత్ ప్రగతి సభకు మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. తెలంగాణ ఏర్పాటుతోనే చీకట్ల నుంచి వెలుగుల్లోకి వచ్చామని, ఈ ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. ఉద్యమ సమయంలో నాటి పాలకులు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడి ప్రజలు చీకట్లో మగ్గుతారంటూ గుబులు పుట్టించిన వారే నేడు చీకట్లోకి పోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడిన రోజున కేవలం 7,778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలనాత్మక నిర్ణయాలతో అది నేడు 18,567 మెగావాట్లకు చేరుకుందని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో పనిచేసే సిబ్బంది మొదలు యాజమాన్యాల వరకు అందరి శ్రమ ఉందని మంత్రి ప్రశంసించారు.
ఉమ్మడి పాలనలో పీక్ డిమాండ్ సమయంలో 13,000 మెగావాట్లు ఉండగా, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే పీక్ డిమాండ్ సమయంలో నమోదైన విద్యుత్ 14,700 మెగావాట్లు అని, ఇది విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతికి అద్దం పడుతుందన్నారు. 2014కు పూర్వం ఎందుకు 24 గంటలు కరెంట్ ఇవ్వలేక పోయారని, అది ఇప్పుడు ఎలా సాధ్యం అయిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సంక్షోభంతో ఎండిపోయిన పంట పొలాలను చూసి తట్టుకోలేక రైతుల ఆత్మహత్యలు, దాంతో కుటుంబ సభ్యుల ఆత్మక్షోభ, మరోవైపు అగ్రి క్రాప్ హాడిడేస్తో రోడ్లెక్కిన పారిశ్రామిక వేత్తల ఆందోళనలతో అట్టుడికిన దుర్భర పరిస్థితుల నుంచి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకున్నామంటే అది ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానమే అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో సాధించిన అభివృద్ధి ఏమిటి అని విమర్శలు చేసే వారికి విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు చెంపపెట్టు లాంటివన్నారు. ఈ సందర్భంగా కళాకారులు, మహిళా ఉద్యోగుల నృత్యాలు, పథకాలపై చేసిన ప్రసారాలు చూపరులను అలరించాయి. కలెక్టర్ వెంకట్రావ్, డీఈ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీలు ధరావత్ కుమారీబాబునాయక్, బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్రెడ్డి, సర్పంచ్ కలకొండ కరుణాశ్యాంసన్, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, విద్యుత్, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.