మిర్యాలగూడ మండలం అవంతీపురం
కొండలపై వెలిసిన శ్రీదేవి, భూదేవీ సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 25నుంచి 27 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 26 వేంకటేశ్వర స్వామి కల్యాణం, అదే రోజు కొండపైన సరస్వతీ దేవి పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారి ఆలయంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నారు. మిర్యాలగూడ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఈ ఆలయంలో స్వామివారు కోరిన
కోర్కెలు తీర్చుతాడని భక్తుల విశ్వాసం.
అవంతీపురం కొండ గూడూరు గ్రామం నుంచి అవంతీపురం గ్రామం వరకు ఏడుకొండలు ఆదిశేషుని ఆకారంలో సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ఏడో కొండపైనే కల్యాణ వేంకటేశ్వర స్వామి వెలిశాడు. 1982లో అవంతీపురంలోని ఒక రైతుకు వేంకటేశ్వర స్వామి కలలో వచ్చి కొండపై వెలిశాను, తనకు గుడి కట్టించాలని చెప్పాడట. వెంటనే ఆ రైతు దేవాలయ నిర్మాణానికి నిధులు సమకూర్చుతుండగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన వైద్యుడు త్రిపురనేని శరత్ బాబు విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. వైద్యుడు తన భార్య నగలను అంతకు ముందే తిరుపతిలో నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకోగా, ఎక్కడైనా ఆ స్వామియేకదా అని ఈ దేవాలయ నిర్మాణానికి తన భార్య బంగారు ఆభరణాలు ఇచ్చేశాడు. వాటితో ఆలయ గర్భగుడితోపాటు మిగతా నిర్మాణ పనులు పూర్తి చేశారు.
వేంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే కష్టాలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఆలయ సన్నిధిలో ఎక్కువగా వివాహాలు జరుగుతాయి. నూతన వాహనాల పూజలు చేయిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. కొండపైన ఉన్న సరస్వతీ దేవి ఆలయాన్ని భక్తులు రెండో బాసరాగా భావిస్తారు. సంవత్సరానికి రెండు పర్యాయాలు చిన్నారులకు సరస్వతీ దేవి సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహిస్తారు.
ఈ 25న ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 6గంటలకు ప్రభాత సేవ, గోసేవ, బిందె తీర్థం, మంత్ర పుష్ప, తీర్థప్రసాద వియోగం ఉంటుంది. 26న ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం,అభిషేకం, నిత్యహోమం, బలిహారం, ఎదుర్కోళ్లు, స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. 27న విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం,అభిషేకం, నిత్యహోమం, సాయంత్రం ధ్వజారోహణం, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షణలు, నీరాజన మంత్ర పుష్పం, తీర్థప్రసాద వియోగం, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతాయి.