శాలిగౌరారం, ఆగస్టు 27 : 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో భాగంగా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డును సొంతం చేసుకున్న ఉప్పెన సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా పని చేసింది మనోడే. నిరుపేద కుటుంబంలో జన్మించినా కష్టపడి ఉన్నతమైన విద్యనభ్యసించి సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న రంజిత్కుమార్ది శాలిగౌరారం మండలంలోని అడ్లూర్ గ్రామం. దేశెట్టి జనార్దన్ – భద్రమ్మ దంపతుల కుమారుడు రంజిత్కుమార్ 1నుంచి 7వ తరగతి వరకు అడ్లూర్ గ్రామంలో చదివాడు. 8, 9వ తరగతులు నకిరేకల్ పట్టణంలోని శివరంజని స్కూల్లో, 10వ తరగతి శాలిగౌరారంలోని విజ్ఞానజ్యోతి పాఠశాలలో, ఇంటర్మీడియట్ ఏవీఎం కళాశాలలో పూర్తి చేశాడు.
అనంతరం మల్టీమీడియా వైపు అడుగులేసి ఆ కోర్సును హైదరాబాద్లో పూర్తి చేశాడు. బెంగళూర్లో శిక్షణ తీసుకున్న అనంతరం సినీ రంగం వైపు దృష్టి సారించాడు. సినీ డైరెక్టర్ సుకుమార్ తీసిన సినిమాలను ప్రేరేపణగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆయనతో పరిచయం పెంచుకొని 2016లో నాన్నకు ప్రేమతో సినిమాకు ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో చేరాడు. అటునుంచి 30రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న సమయంలో ఉప్పెన సినిమాకు అవకాశం వచ్చినట్లు రంజిత్కుమార్ తెలిపాడు.
అసోసియేట్ డైరెక్టర్గా పని చేసిన ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టడంతోపాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డును గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదని ఆయన తెలిపారు. బుట్టబొమ్మ సినిమాలో చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పని చేస్తూ.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మారుమూల ప్రాంతంలో జన్మించి సినిమా ఇండస్ట్రీలో పని చేస్తుండడం, ఉప్పెన సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డును సొంతం చేసుకోవడంలో భాగస్వాములైన రంజిత్కుమార్ను గ్రామస్తులు అభినందించారు. సొంత డైరెక్షన్లో సినిమా తీయాలనేదే తన జీవితాశయమని రంజిత్కుమార్ అన్నారు.