యాదగిరిగుట్ట, మార్చి 10 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లకు సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం కల్యాణమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేసి సేవను కొనసాగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు.
ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. నిజరూప దర్శనంలో స్వయంభువులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108బంగారు పుష్పాలు ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు. అనంతరం స్వామివారికి హారతినిచ్చి భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం చేశారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు.
పాతగుట్టలో స్వామికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ఊంజల్ సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 15వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.18,32, 659 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.