ఎటుచూసినా కొండలు.. అల్లుకున్న పచ్చదనం
ఎత్తైన నల్లని కొండలు.. విస్తారంగా పరుచుకున్న పచ్చని దట్టమైన అడవి, బలిష్టమైన దుర్గా ప్రాకారాలు, ఈత కొలనులు.. చారిత్రక కట్టడాలు, పొడవైన కోట గోడలు, రమణీయ వాతావరణంతో ఉండ్రుగొండ గుట్టలు కనువిందు చేస్తున్నాయి. గిరి దుర్గంలో కొలువై ఉన్న లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆధ్యాత్మిక నిలయంగా పేరొందింది. స్వామివారిని దర్శించుకున్నవారు ప్రకృతి అందాలను తిలకించకుండా ఇక్కడి నుంచి వెళ్లరు. ప్రకృతి అందాలను తిలకించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి, యువకులు, ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఇక్కడ తరచూ ఫొటో షూట్లు, షార్ట్ఫిల్మ్ల చిత్రీకరణ జరుగుతుంటాయి.
ఉండ్రుగొండ గిరిదుర్గం చరిత్ర..
ఉండ్రుగొండ గిరి దుర్గం సుమారు 6వేల ఏండ్ల పురాతనమైందని పురావస్తు శాఖ ధ్రువీకరించింది. ఆరో శతాబ్దంలో చాణిక్యులు, 8, 9వ శతాబ్దంలో కళ్యాణ చాణిక్యులు, విష్ణు కుండీనులు, 400ఏండ్ల తర్వాత రేచర్ల పద్మ నాయకులు, రెడ్డి నాయకులు ఉండ్రుగొండను కేంద్రంగా చేసుకుని పరిపాలన సాగించినట్లు చరిత్ర చెబుతుంది. కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి, శ్రీకృష్ణ దేవరాయలు, కుతుబ్ షాహీ, అసబ్ షాహీ (గోల్కొండ నవాబులు) ఈ ప్రాంతాన్ని సామంత రాజుల సహాయంతో ఏలినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. (బ్రిటీష్ ఆర్కియాలజిస్ట్ రాబర్ట్ స్టీవెల్ 1882 వాల్యూ నెంబర్ -1, పేజీ 46లో ఉండ్రుగొండ గురించి రాసినట్టు ఇండోలాజికల్ బుక్ హౌజ్ ఢిల్లీ వారి ప్రచురణలో పేర్కొనబడింది). ఉండ్రుగొండ గిరి దుర్గం ఎనిమిది కొండలు కలుపుతూ ఉంటుంది.
15 అడుగుల ఎత్తయిన రాతి ప్రాకారము, 10 అడుగుల వెడల్పు, రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం సుమారు 14 కిలోమీటర్ల పొడవైన కోట గోడ, 14 వందల ఎకరాల విస్తీర్ణం ఉండడం గమనార్హం. కోట గోడకు 18 దర్వాజలు వివిధ రూపాల్లో వివిధ అవసరాలకు నిర్మింపబడి ఉన్నాయి. శిలా శాసనాలు, రాగి పలకలపై ఉన్న శాసనాలు, తాంత్రిక ముగ్గులు, వివిధ దేవతా ప్రతి రూపాలు, రేఖా చిత్రాలు నాటి కాలమానాన్ని కొంతవరకు దార్శనికం చేస్తాయి. ఇక్కడ కనిపించే రాక్షస గూళ్లు ఆదిమ జాతి మానవుడి మనుగడను సూచిస్తాయి. ఈక్షాకులు క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం రెండో శతాబ్దం వరకు పాలించినట్లుగా ఇప్పుడున్న గంగ మల్లికార్జునస్వామి దేవాలయంపై ఉన్న తాంత్రిక ముగ్గులు, క్రీస్తు శకం ప్రారంభంలో ఉన్న కాలయ వనుల కాలంనాటి గుర్తులు, రుషుల మఠాలు దర్శనమిస్తున్నాయి. విష్ణు కుండీనుల పాలనకు గుర్తుగా ఉన్న వివిధ వైష్ణవ ఆలయాలు, మండపాలు శిథిలమై ఉన్నాయి. అష్టదిక్కుల్లో ఎనిమిది కాలభైరవ ప్రతిమలు, కోట చుట్టూ ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నాయి.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండ గుట్టల్లో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి ఆలయం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ ఆలయం హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి 65పై సూర్యాపేట జిల్లా కేంద్రానికి 12కిలోమీటర్ల దూరంలో ఉన్నది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ ఫొటో షూట్లు, షార్ట్ ఫిల్మ్లు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు నిత్యం జరుగుతున్నాయి.
అలరిస్తున్న హ్యాంగింగ్ స్టోన్స్
లక్షీనర్సింహస్వామి ఆలయానికి ఆనుకొని తూర్పు గుట్టకు ఆలయం పైన ఉన్న హ్యాంగింగ్ స్టోన్స్ (వేలాడుతున్న రాళ్లు) అత్యంత అద్భుత దృష్యాల్లో ఒకటిగా చెప్పొచ్చు. స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడూ వీటిని చూస్తూ అలా ఉండి పోతుంటారు. వాటిని చూస్తుంటే మీద పడుతాయేమోనన్న సందేహం కలుగుతుంది. నిటారుగా ఉన్న కొండకు రాళ్లను ప్రత్యేకంగా అతికించినట్టుగా వేలాడుతూ ఉండడం మరో ప్రత్యేకత.
షార్ట్ ఫిల్మ్లు, ప్రీ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ షూటింగ్
ఎంతో ప్రసిద్ధి చెందిన ఉండ్రుగొండ గుట్టల్లో షార్ట్ ఫిల్మ్, ప్రీ వెడ్డింగ్, ఫొటో షూటింగ్ కోసం జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి నిత్యం ఇక్కడకు వస్తుంటారు. అక్కడున్న ప్రతి లోకేషన్ అద్భుతంగా ఉండటమే కాకుండా షూటింగ్లకు అనుకూలంగా ఉండటంతో యువకులు అధికంగా వస్తున్నారు. ఈ గుట్టను ఒక్కసారి సందర్శిస్తే మరోసారి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో సందర్శించాలనుకుంటారు.
అద్భుతంగా రాతి మంటపం
కోట పైభాగంలో వంపు ప్రదేశంలో నిర్మితమైన రాతి మంటపాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించారు. మంటప నిర్మాణంలో ఉపయోగించిన స్తంభాలు అతికించడానికి ఎటువంటి మిశ్రమం వాడకుండా ఏక స్తంభంపై మరో స్తంభం నిలబెట్టిన విధానం అబ్బురపరుస్తుంది. ఎత్తయిన కొండల మీద శిలలను తొలిచి అందమైన రాతి శిల్పాలుగా మలుచడానికి వారు పడిన శ్రమ మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.
గుట్ట చుట్టూ అనేక శిల్పాకృతులు
ఆలయం ముందున్న కోనేరులో గజేంద్ర మోక్షం తలపించు కరి-మకరుల ఆకృతులు, ఆలయం వెనుక భాగాన ఆదిశేష అవతారం, కోనేరు ఒడ్డున కూర్మావతారం, ఆలయానికి వచ్చే దారిలో ఎస్సారెస్పీ కాల్వ (జాతీయ రహదారి 65) దగ్గర నుంచి చూస్తే హిరణ్యకశపుని సంహారం తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఉన్న శయన నరసింహస్వామి, సహజ శిల్పాకృతులు ఉన్నాయి. గుహలు, ఆంజనేయస్వామి, కాలభైరవ విగ్రహాలు, కోట గోడలు, గుట్ట పైనుంచి దేవాలయం వెనుక భాగం ఆనుకొని ఉన్న గుట్ట మీద వేలాడుతున్నట్టుగా ఉండే గుండ్లు (హ్యాంగింగ్ స్టోన్స్), చారిత్రక శిథిలాలు ఉన్నాయి. మంత్రి బావి, చాకలిదాని పడిగ, సింగరేణి కుంట, కోనేర్లు ఇప్పటికీ నీటితో కళకళ లాడుతున్నాయి. బోగందాని గద్దె, పందెం బావి, కేపిరాయిని కుంట, నాయినివారి బావి, ఏనుగుల దర్వాజ, పీనుగుల దర్వాజ, నాగులపహాడ్ దర్వాజ, మల్లయ్యస్వామి గుడి, రుషుల మఠం, పహారా, గోపాలస్వామి గుడి, గుట్ట చుట్టూ 18 ఆంజనేయస్వామి విగ్రహాలు రామాలయ స్థలం, శంఖం, చక్రం, మూల దర్వాజ, జాలు దర్వాజలు ఉన్నాయి. భారతదేశంలో ఏ గుట్టపైనా లేని విధంగా ఇక్కడ గుట్టపైన నీరు నిల్వ ఉండడం ఉండ్రుగొండకున్న ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ గుట ్ట2002లో వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో 2002 సంవత్సరంలోనే ఇది వెలుగులోకి వచ్చినప్పటికీ అప్పటి పాలకులు పట్టించుకోకపోవడంతో ఏ మాత్రమూ అభివృద్ధి జరుగలేదు. స్వరాష్ట్రంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహించడంతోపాటు నిత్య పూజలు జరుగుతున్నాయి. ఆలయం వద్దకు వెళ్లేందుకు ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. భక్తుల కోసం ప్రజా మరుగుదొడ్లను నిర్మించారు. ఆలయం వద్ద మినీ ఫంక్షన్ హాల్, ఆలయం ఎదుట ఉన్న కోనేరుకు మెట్లు ఏర్పాటు చేశారు.