భువనగిరి అర్బన్, ఏప్రిల్ 17 : జిల్లాలోని భువనగిరి ఎస్సీ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలు మరువకముందే పట్టణ పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి మృతి చెందాడు. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, వసతి గృహాల్లోనే మృతి చెందుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందడంతోపాటు విద్యార్థులను అక్కడ ఉంచాలంటేనే జంకుతున్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.
గురుకులాలు, వసతి గృహాల్లో అపరిశుభ్రంగా వంట గదులు, బోరు నీటి వాడకం, వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు అందుబాటులో ఉండకపోవడం, వంటలను ఇష్టానుసారంగా చేస్తుండడం ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని తేటతెల్లమైంది. గతంలోనూ ప్రభుత్వ వసతి గృహాల్లో సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలు బలిగొన్నారు.
మౌలిక వసతులు లేకపోవడం, విద్యార్థుల బాగోగులు సరిగా చూసుకోకపోవడం, సరైన భోజనం పెట్టకపోవడం, ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు లేక బయటి వ్యక్తులపై ఆధారపడడం, యాజమాన్యం బయటి వ్యక్తులకు అప్పగించడంతో విద్యార్థులు ఆత్యహత్యలు చేసుకుంటున్నారు. నైపుణ్యం లేని సిబ్బందితో వంటలు చేయించడంతో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో కలుషిత ఆహారం కారణంగా బొమ్మలరామారం, గుండాల, భువనగిరి, వలిగొండ, మోటకొండూరు వసతి గృహాల్లోనూ ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి.
భువనగిరిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో యాజమాన్యం నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజన్తో ఓ విద్యార్థి బలయ్యాడు. ఈ నెల 11న విద్యార్థులకు కలుషిత ఆహారం పెట్టగా అది తిన్న విద్యార్థులు సుమారు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 25 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా యాజమాన్యం నిర్లక్ష్యంతో గుట్టుచప్పుడు కాకుండా పాఠశాలలోనే వైద్యాధికారుల సాయంతో తల్లిదండ్రులకు చెప్పకుండా రెండు రోజులు చికిత్స చేయించారు. సరైన చికిత్స అందకపోవడంతో 10 మంది పరిస్థితి విషమించింది. వీరిలో ఆరుగురిని భువనగిరి ఏరియా దవాఖానకు, నలుగురిని హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానాకు తరలించి చికిత్స చేయించారు.
కానీ, రెయిన్బో దవాఖానలో చికిత్స పొందుతూ సీహెచ్ ప్రశాంత్ అనే విద్యార్థి ఈ నెల 16న మృతి చెందాడు. భువనగిరి ఏరియా దవాఖానలో మరో ఐదుగురు, గురుకుల పాఠశాలలో ఆరుగురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇందుకు పూర్తి బాధ్యత పాఠశాల యాజమాన్యానిదేనని, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే ఇంతమంది అస్వస్థతకు గురయ్యారని, ఒక విద్యార్థి మృతి చెందడంతో ప్రభుత్వం పాఠశాల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసింది. ఓ కమిటీని ఏర్పాటు చేసి జరిగిన ఘటనపై నివేదిక అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కోలుకున్న విద్యార్థులతోపాటు ఇతర విద్యార్థులు ఇండ్లకు వెళ్లిపోతున్నారు. పాఠశాలలో అరకొర వసతులు ఉన్నాయని, రాత్రివేళ విరేచనాలు అయితే ఇబ్బంది అవుతుందని, మరుగుదొడ్లు దూరంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు.
ఫుడ్ పాయిజన్తో ఎంతోమంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడడంతోపాటు మంగళవారం మృతి చెందిన ప్రశాంత్ అనే విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి బుధవారం హాస్టల్ ముందు ధర్నా నిర్వహించారు. అలాగే బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలోనూ ధర్నా చేపట్టి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగిన సంఘటనగా పేర్కొన్నారు.