ఆత్మకూర్.ఎస్, డిసెంబర్ 18 : తమ వివాహేతర సంబంధానికి సమాజం ఆటంకంగా ఉందని పురుగుల మందు తాగి యువకుడు, వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఉప్పునూతల లావణ్య(28), చింతపల్లి మహేశ్(25) బలవన్మరణానికి పాల్పడ్డారు. దాంతో లావణ్య ముగ్గురు పిల్లలు తల్లిలేని వారయ్యారు.
గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన ఉప్పునూతల గంగరాజుకు పదేండ్ల క్రితం సిరికొండ గ్రామానికి చెందిన లావణ్యతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. అదే గ్రామానికి చెందిన చింతపల్లి మహేశ్తో మూడేండ్ల క్రితం లావణ్యకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన లావణ్య భర్త పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టి మందలించారు. అయినా వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉన్నారు. వారిని ఇటీవల ఇరువురి కుటుంబ సభ్యులు తీవ్రంగా మందలించి హెచ్చరించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం మహేశ్, లావణ్య ఇల్లు విడిచి వెళ్లిపోయారు.
కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు వెతికినా ఎక్కడా జాడ తెలియకపోవడంతో లావణ్య భర్త గంగరాజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆదివారం తెల్లవారుజామున మొబైల్ లొకేషన్ ఆధారంగా మహేశ్ కౌలుకు సాగు చేస్తున్న భూమి వద్దకు వెళ్లారు. అక్కడ మహేశ్, లావణ్య మృతదేహాలను గుర్తించారు. పక్కన పురుగుల మందు డబ్బాలు ఉండడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ సోమనారాయణ, ఎస్ఐ యాదవేందర్రెడ్డి పరిశీలించారు. మృతురాలి భర్త గంగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ యాదవేందర్రెడ్డి తెలిపారు.
తల్లిలేని పిల్లలుగా చిన్నారులు
ఉప్పునూతల లావణ్యకు ముగ్గురు పిల్లలు కుమార్తె భవ్యశ్రీ (9), కవలలు మను (6), సాయి (6) ఉన్నారు. లావణ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ చిన్నారులు తల్లిలేని వారిగా మిగిలారు.