రామగిరి/సూర్యాపేట అర్బన్, మే 24 : పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్- 2024 ప్రవేశ పరీక్ష శుక్రవారం సజావుగా జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరిగింది.
పరీక్షకు 3,842మంది విద్యార్థులకుగాను 3,361(బాలురు 1,924, బాలికలు 1,437) మంది హాజరైనట్లు టీఎస్ పాలీసెట్ జిల్లా కో కన్వీనర్, నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జానకీదేవి తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలను ఆమె తనిఖీ చేసి పర్యవేక్షించారు.
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు సూర్యాపేట జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,362 మంది విద్యార్థులకు 305 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను పరీక్షల విభాగ అధికారి శ్రీనయ్య, నాయబ్ తాసీల్డార్ స్వప్న పరిశీలించారు.