మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్సేనని, బీజేపీకి మూడో స్థానమే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరిలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఫ్లోరోసిస్ పాపం గత పాలకులదేనని, సీఎం కేసీఆర్ ఆరేండ్లలోనే ఫ్లోరిన్ భూతాన్ని రూపుమాపారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆసరా పింఛన్లతో లబ్ధిదారుల్లో నూతనోత్సాహం నిండిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని చెప్పారు.
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 28 : మునుగోడు గడ్డపై బీజేపీది మూడో స్థానమేనని.. ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ప్రజలే చెబుతున్నారని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లగిరి గ్రామంలోని రిక్కల భాస్కర్రెడ్డి గార్డెన్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరగ్గొడుతున్న పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అదేవిధంగా ఇక్కడి ఎమ్మెల్యే రాజీనామాతో తమ కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహం కనిపిస్తున్నదన్నారు. టీఆర్ఎస్ను గెలిపించేందుకు వారు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
నియోజకవర్గంలో 60ఏండ్లుగా ప్లోరోసిస్ను పెంచి పోషించిన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పాపాన్ని సీఎం కేసీఆర్ ఆరేండ్లలో రూపుమాపాడన్నారు. ప్రస్తుతం ఒక్క ఫ్లోరోసిస్ కేసు నమోదు కాకపోవడం కేసీఆర్ ఘనతేనని కొనియాడారు. మిషన్ భగరీథ పథకం, 24గంటల విద్యుత్తో ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తున్నదన్నారు. అంతేగాక రాష్ట్రంలో 40వేలకు పైగా పింఛన్ల మంజూరుతో దాదాపు 50నుంచి 60శాతం కుటుంబాలకు పింఛన్లు అందుతున్నాయన్నారు. వీటితో గ్రామీణ అర్థిక వ్యవస్థ మరింత బలపడిందన్నారు. ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రవేశపెట్టిందన్నారు. 2018లో జరిగిన పొరపాటును సరిచేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, నాయకులు బొడ్డు శ్రీనివాస్రెడ్డి, చింతల దామోదర్రెడ్డి, చెన్నగోని అంజయ్యగౌడ్, ముత్యాల ప్రభాకర్రెడ్డి, కొత్త పర్వతాలుయాదవ్, శ్రీనివాస్గౌడ్, మాధవరెడ్డి, శ్రీధర్రెడ్డి, సర్పంచులు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.