సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఆటో కార్మికులకు గులాబీ పార్టీ అండగా ఉంటే.. కాషాయ బీజేపీ గుదిబండగా మారిందని ఆటో కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలతో ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న బీజేపీని మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిస్తామని చెప్పారు. బుధవారం ప్రగతిభవన్లో టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ, ఏఐటీయూసీ యూనియన్ల అనుబంధ ఆటో సంఘాల నాయకులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ను కలిశారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేస్తున్నామని.. ఇప్పటికే ఆటో సంఘాల నాయకులు ప్రచారంలో ఉన్నారని మంత్రికి వివరించారు.
నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లంతా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్కేవీ నాయకుడు వేముల మారయ్య మాట్లాడుతూ కరోనా క్లిష్ట సమయంలో ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆటోడ్రైవర్లకు దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వాహన మోటార్ పన్నును రద్దు చేసి అండగా నిలిచిందన్నారు. రెండు త్రైమాసికాల పన్ను రద్దు చేసి కార్మికులకు భరోసాగా ఉన్నదని తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించిన ఘనత తెలంగాణ సర్కార్దేనని అన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో జేఎన్ఎన్యూఆర్ఎం స్కీంలో భాగంగా సంగారెడ్డి అమీన్పూర్లో 400 మంది ఆటో డ్రైవర్లకు ఇండ్లు కేటాయించుకోగలిగామని చెప్పారు. ఏఐటీయూసీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం మాట్లాడుతూ కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు టీఆర్ఎస్ పార్టీపై విషపూరితంగా ప్రచారం నిర్వహిసున్నారని, వాటిని తిప్పికొట్టామని చెప్పారు. కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ నాయకులు పిల్లి శంకర్, టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ నాయకులు యాట కృష్ణ, సాయి, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది
కరోనా రెండవ వేవ్ లాక్డౌన్ తర్వాత తెలంగాణ రాష్ట్ర టాక్సీడ్రైవర్లు ఆర్థికంగా నష్టపోయి ఈఎంఐలు కట్టలేని పరిస్థితి నెలకొంది. ఫైనాన్సర్ల బాధలు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ఎస్ఎంఈతో చర్చించి 6 నెలల నుంచి ఏడాది వరకు రీస్ట్రక్చర్ చేయించి టాక్సీ డ్రైవర్లను ఆదుకుంది. కరోనా కారణంగా గిరాకీ లేక ఆర్థికంగా నష్టపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ టాక్సీ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం 35శాతం సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాలు అందించింది.
– సలావుద్దిన్, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర టాక్సీ అసోసియేషన్
టీఆర్ఎస్ గెలుపు ఖాయం
బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో టీఆర్ఎస్దే విజయం. వాహన కార్మికులకు అండగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్దే. కేంద్ర ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలతో పన్నులు చెల్లించలేక నష్టపోయాం. బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. మా డ్రైవరన్నల మద్దతు టీఆర్ఎస్కే.
-సూర్వి యాదయ్యగౌడ్, అధ్యక్షుడు, రాష్ట్ర లారీ సంఘం.