సూర్యాపేట, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : సహజ సిద్ధంగా అభించే ఇసుక కూడా బంగారంగా మారింది. స్థానికంగా రీచ్లు బంద్ కావడంతో ఇసుక ధర అమాంతం పెరిగింది. మూడు నెలల క్రితం వరకు సూర్యాపేటలో ఒక్కో ట్రాక్టర్ రూ.1800 ఉండగా నేడు రూ.4 వేల నుంచి రూ.6వేలకు చేరుకుంది. తుంగతుర్తి నియోజకవర్గంలోని రీచ్లను బంద్ చేయడంతోపాటు మూసీ వాగులో ఇసుక రవాణాను కట్టడి చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గతంలో నిర్మాణాలకు ఇసుకను తాసీల్దార్లు అనుమతి ఇవ్వగా ఇప్పుడు వారి నియంత్రణలో లేదు. దాంతో రాత్రి వేళల్లో ఇసుకాసురులు దొంగతనంగా తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇక్కడ ఇసుక కొరత రావడంతో మరో పక్క ఇసుక వ్యాపారులు ఆంధ్రా, భద్రాచలం తదితర దూర ప్రాంతాల నుంచి లారీల్లో ఇసుకను తెప్పిస్తున్నారు. గతంలో టన్ను ఇసుక రూ.650 నుంచి రూ.700 ఉండగా ప్రస్తుతం రూ.1500 నుంచి రూ.1600 చేశారని పలువురు నిర్మాణాదారులు చెబుతున్నారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో రీచ్లు బంద్
జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న ఇసుక రీచ్లను మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు జిల్లాలో ఉన్న మూసీ, పాలేరు లాంటి ఏటిలో అధికారులు ఇసుక రవాణాకు అనుమతి ఇస్తుంటారు. గతంలో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం అనంతారం, తాటిపాములు నాగారం మండలం పేరబోయినగూడెంతోపాటు జాజిరెడ్డిగూడెంలలో ఇసుక రీచ్లు ఉండగా జిల్లా కేంద్రంతోపాటు ఎక్కడికైనా నిర్మాణాలు చేసుకునేవారు సంబంధిత పత్రాలు సమర్పించి ఇసుక తీసుకెళ్లే అవకాశం ఉండేది. అందుకు టన్నుకు రూ.150 నుంచి రూ.200 వరకు డీడీ తీసి జేసీబీ, ట్రాక్టర్ కిరాయిలు కలుపుకొని తీసుకెళ్లేవారు. సూర్యాపేటకు ఒక ట్రాక్టర్ ఇసుక రూ.2,500కి లభించేది.
ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గంలో రీచ్లు మూసివేయగా స్థానిక నిర్మాణాలకు మాత్రం తాసీల్దార్లు నుంచి అనుమతులు ఇస్తున్నా నియంత్రణ లేకపోవడం, అధికారుల మామూళ్లు గణనీయంగా పెరుగడంతో ట్రాక్టర్ ఇసుక రూ.4,500 నుంచి రూ.5,000కి పెరిగింది. ఇక మూసీ వాగు నుంచి గతంలో అధికారుల అనుమతితో రూ.1800 ట్రాక్టర్ ఇసుక లభించేది. దాన్ని బంద్ చేయడంతో కృత్రిమ కొరత ఏర్పడి ఇసుకాసురులు దొంగతనంగా తెచ్చే ఇసుకను ఒక్కో ట్రాక్టర్ రూ.4వేలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు ఆంధ్రాతోపాటు భద్రాచలం నుంచి ఇసుకను తెచ్చి అమ్ముతున్నారు. గతంలో టన్ను ఇసుక రూ.650 నుంచి రూ.700 ఉండగా ఇప్పుడు రూ.1,000 నుంచి రూ.1,200 విక్రయిస్తున్నారు. అధికారులు ఇసుక రవాణాను నిలిపివేయడంతో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లి ఇసుక ధరలు పెరుగుతున్నాయి. దాంతో నిర్మాణదారులకు పెనుభారంగా మారింది. ఇప్పటికైనా అధికారులు ఇసుకను తక్కువ ధరల వచ్చేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.