రామగిరి, డిసెంబర్ 19 : గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు రవాణా భత్యాన్ని ప్రభుత్వం – విద్యాశాఖ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంత మంది అర్హులు ఉన్నారో జిల్లా యంత్రాంగం లెక్క తేల్చి రాష్ట్ర విద్యాశాఖకు సమగ్రశిక్ష ద్వారా అందజేసింది. అలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,523 మంది విద్యార్థులకు ఊరట లభించనున్నది. ఈ నిధులను విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లోకి నేరుగా జమ కానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం ప్రణాళికలను సైతం అధికారులు సిద్ధం చేసి సమర్పించారు.
బస్సు సౌకర్యం లేని ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులను విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం అర్హులైన విద్యార్థుల జాబితాలను డీఈఓల ఆమోదంతో సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు రాష్ట్ర విద్యాశాఖ – సమగ్రశిక్షకు పంపించారు.
రవాణా భత్యం అమలు ఇలా..
రవాణా భత్యం నిధులను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు వేర్వేరుగా అందిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.400, ప్రాథమికోన్నత, జడ్పీ పాఠశాలల విద్యార్థులకు రూ.600 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు ఆయా మండలాల ఎంఆర్సీల నుంచి ఆన్లైన్లో నమోదు చేసిన 3,523 మంది విద్యార్థులకు లబ్ధి కలుగనున్నది.
నిబంధనల మేరకు అమలు చేస్తాం
విద్యాశాఖ మంజూరు చేసే రవాణా భత్యానికి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో అర్హత కలిగిన విద్యార్థుల వివరాలను సమగ్రశిక్ష ఆధ్వర్యంలో అధికారులు గుర్తించారు. 2022-23 విద్యా సంవత్సరం సంబంధించి అర్హుల జాబితాలను ప్రభుత్వానికి, విద్యాశాఖకు అందజేశాం. దానికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తున్నారు. రవాణా చార్జీలకు సంబంధించి ఉత్తర్వులు అందగానే నిబంధనల మేరకు విద్యార్థులకు అందజేసేలా చర్యలు తీసుకుంటాం. నిధులను విద్యార్థుల వ్యక్తిగత అకౌంట్లలో జమ చేస్తాం.
– అశోక్, సూర్యాపేట డీఈఓ