సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 18 : సూర్యాపేట జిల్లా ఆర్మూడ్ పోలీస్ విభాగం (ఏఆర్) నందు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నాగేశ్వరరావు, శ్రీధర్, భాస్కర్, వెంకటేశ్వర్లు, సోమయ్య, సుమన్, ఆనందరావు సివిల్ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బదిలీ అయిన సిబ్బంది జిల్లా ఎస్పీ నరసింహను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. బదిలీ అయిన సిబ్బందికి ఎస్పీ మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్మూడ్ విభాగంలో క్రమశిక్షణతో పని చేశారని అభినందించారు. శాంతి భద్రతల విభాగంలోనూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందించడంలో ముందుండాలన్నారు. కొత్త బాధ్యతలను సామర్థ్యంతో, నైపుణ్యంతో నిర్వహించాలని సూచించారు. క్రమశిక్షణ కలిగి కొత్త అంశాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ నేరాల నివారణ, నేరాల చేదనలో నైపుణ్యం కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డీఎస్పీ నరసింహ చారి, పోలీస్ సంఘం అధ్యక్షుడు రామచంద్ర గౌడ్, ఆర్ఎస్ఐ అన్వర్ పాల్గొన్నారు.