బొడ్రాయిబజార్, మార్చి 12 : ఎనిమిదేండ్లుగా మున్సిపల్ కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేస్తూ ట్రేడ్ లైసెన్స్లకు నకిలీ రసీదులు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన మున్సిపల్ జవాన్ను అధికారులు విధుల నుంచి తొలగించారు. అతడిపై పోలీసు ఆదివారం కేసు నమోదు చేశారు. సూర్యాపేట మున్సిపాల్టీలో పని చేస్తున్న మున్సిపల్ శానిటరీ జవాన్ హనుమంతు పట్టణంలోని ఓ మీసేవా సెంటర్ నిర్వాహకులతో కలసి కొన్నేండ్లుగా మున్సిపాలిటీకి చెందిన నకిలీ రసీదులు ప్రింట్ చేస్తున్నాడు. వాటిని ప్రధాన కూడళ్లలో వీధి వ్యాపారాలు చేసుకునే వారికి ఇచ్చి రూ. 1000 నుంచి 5వేల వరకు వసూలు చేస్తున్నాడు. నకిలీ రసీదులపై మున్సిపల్ కమిషనర్ల సంతకాలను ఫోర్జరీ చేసి 2016 నుంచి 2023 మార్చి వరకు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను వసూలు చేశాడు. జిల్లా కేంద్రంలోని వ్యాపారులను లైసెన్స్ ఫీజులు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ పి. రామానుజులరెడ్డి కోరగా వారు హనుమంతు ఇచ్చిన రసీదును చూపించారు. సదరు రసీదులపై ఉమ్మడి నల్లగొండ జిల్లా స్టాంప్ ఉండడంతో అనుమానించిన కమిషనర్ వెంటనే మున్సిపల్ అధికారులు, సిబ్బందిని పిలిపించి విచారణ నిర్వహించారు. రసీదులు జారీ చేసింది శానిటరీ జవాన్ హనుమంతుగా తేలడంతో అతడిని విధుల నుంచి తొలగించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ సీఐ రాజశేఖర్ వ్యాపారులకు నకిలీ రసీదులు అంటగట్టి అక్రమాలకు పాల్పడిన జవాన్తో పాటు మీసేవ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయమై విచారణ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.