ఒకప్పుడు అంటే ఫ్లోరోసిస్ గుర్తుకొచ్చేది. పరిస్థితి అలాగే కొనసాగితే నో మ్యాన్ జోన్గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి హెచ్చరించాయంటే ఇక్కడి పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని గత పాలకులు పట్టించుకోకపోవడంతో ఫ్లోరైడ్ భూతం ఎంతో మందిని దివ్యాంగులుగా మార్చింది. వారి మూత్రపిండాలను పిండి చేసింది. మునుగోడు నియోజకవర్గంలోని జనాభాలో 10శాతం మంది ఫ్లోరైడ్ బాధితులుండడం గమనార్హం.
ఈ నేపథ్యంలో స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫ్లోరైడ్ను కూకటివేళ్లతో పెకిలించేందుకు మిషన్ భగీరథ పథకానికి అంకురార్పన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో పైలాన్ను ఆవిష్కరించారు. దీంతో ఎనిమిదేండ్లలో నియోజకవర్గంలో ఒక్క కొత్త ఫ్లోరోసిస్ కేసూ నమోదు కాలేదు. కానీ.. గతంలో ఉన్న ఫ్లోరైడ్ బాధితుల్లో చాలామంది కిడ్నీ చెడిపోవడంతో వారు తప్పక డయాలసిస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం నిత్యం హైదరాబాద్కు వెళ్లి డయాలసిస్ చేసుకుంటూ అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి.. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో చౌటుప్పల్లో ఐదు డయాలసిస్ యంత్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే డయాలసిస్ యంత్రాల ఏర్పాటుకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ జీఓను సైతం జారీ చేశారు.
– చౌటుప్పల్, ఆగస్టు 23
డయాలసిస్ బాధలు తీరినట్టే..
చౌటుప్పల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. ప్రస్తుతం డయాలస్ చేయించుకోవాలంటే హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి వెళ్తున్నాం. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం సహకరించక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇకమీదట ఆ అవస్థలన్నీ తప్పుతాయి. నాలాంటి ఫ్లోరోసిస్ బాధితులందరికీ డయాలసిస్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుంది.
-అంశల స్వామి, ఫ్లోరోసిస్ బాధితుడు, శివన్నగూడెం
వేలాది మందికి ఉపశమనం..
మునుగోడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కిడ్నీ బాధితులున్నారు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి వారిది. కార్పొరేట్ దవాఖానల్లో డయాలసిస్ చేయించుకోవడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో నిరుపేదలు అవస్థలు పడుతున్నారు. డయాలసిస్ తీసుకునే స్థోమత లేక మిన్నకుండిపోతున్నారు. మరికొంత మంది వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం చౌటుప్పల్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేస్తున్న డయాలసిస్ సెంటర్తో ఈ బాధలకు చెక్ పడనుంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని వేలాది మందికి ఉపశమనం కలుగనుంది.
ఒక్క షిప్ట్లో ఐదుగురికి డయాలసిస్..
చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేస్తున్న ఐదు యంత్రాలతో ఒక్క షిప్టులో ఐదుగురికి డయాలసిస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ చేసేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. డయాలసిస్ చేసేందుకు నిపుణులైన డాక్టర్లతోపాటు నాణ్యమైన టెక్నీషియన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. డయాలసిస్ సెంటర్ను ప్రత్యేక భవనంలో సకల హంగులతో త్వరలో ఏర్పాటు చేయనున్నారు.
మూడు జిల్లాల ప్రజలకు లబ్ధి..
చౌటుప్పల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యంత్రాల వల్ల యాదాద్రి భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూదాన్పోచంపల్లి, వలిగొండ మండలాలు.. నల్లగొండలోని చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడెం మండలాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారం, అబ్దుల్లాపూర్మెట్ తదితర గ్రామాల బాధితులకు డయాలసిస్ సేవలు అందనున్నాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనే చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖాన ఉండడంతో రాకపోకలు చాలా సులువుగా సాగించేందుకు వీలుంటుంది. దీంతో చౌటుప్పల్లో ఏర్పాటు చేయనున్న డయాలసిస్ యంత్రాలు ఆయా ప్రాంతాల బాధితులకు వరంగా మారనున్నాయి.
ఫ్లోరైడ్ను తరిమిన టీఆర్ఎస్ ప్రభుత్వం..
ఇప్పటికే నియోజకవర్గం నుంచి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. గత బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఫ్లోరైడ్ వ్యాధిగ్రస్తులు కిడ్నీలు పోగొట్టుకొని ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ఒకవైపు ఈ రోగంతో పోరాటం చేస్తూ, మరో పక్క ఆర్థిక సమస్యలతో అతలాకుతలమవుతున్నారు. ఈ బాధలను శాశ్వతంగా రూపుమాపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చౌటుప్పల్లో ఏర్పాటు కానున్న ఐదు డయాలసిస్ యంత్రాలతో ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య అందనుంది.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఐదు యంత్రాలను ఏర్పాటు చేయడం హర్షదాయకం. ఇకపై డయాలసిస్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. చౌటుప్పల్లో డయాలసిస్ చేసుకోవచ్చన్న వార్త ఆనందాన్ని కల్గిస్తున్నది.
– పార్వతమ్మ, ఫ్లోరోసిస్ బాధితురాలు, వట్టిపల్లి
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
మునుగోడు ప్రాంతంపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక ప్రేమ ఉంది. ఉద్యమ నాయకుడిగా ఈ ప్రాంతంలో పర్యటించిన కేసీఆర్ ఇక్కడి ప్రజల అవస్థలు చూసి చలించిపోయారు. అప్పుడే ఫ్లోరైడ్ అంతానికి కంకణం కట్టారు. డయాలసిస్ సెంటర్ లేకపోవడం వల్ల ఈ ప్రాంత బిడ్డలు పడుతున్న బాధలను జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లాం. వెంటనే స్పందించిన మంత్రులు చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానలో 5 యంత్రాలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయించారు. ఈ యంత్రాలను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, అందుకు కృషి చేసిన మంత్రులు జగదీశ్రెడ్డి, హరీశ్రావుకు కృతజ్ఞతలు.
– కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల చొరవతో..
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి చొరవతో ఈ డయాలసిస్ యంత్రాలు మంజూరయ్యాయి. నియోజకవర్గ ప్రజలను పట్టిపీడుస్తున్న కిడ్నీ వ్యాధితో ఎంతో మంది డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తున్నది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ యంత్రాలను అమర్చాలని విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం యంత్రాల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. డయాలసిస్ యంత్రాల ఏర్పాటుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.