తిరుమలగిరి మే 26 : తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలకు ఎన్.బీ.ఏ (నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్) గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ శుక్రవారం తెలిపారు. 2019లో న్యూఢిల్లీలోని ప్రభుత్వ స్వతంత్ర సంస్థ ఎన్.బీ.ఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా మార్చి 31, ఏప్రిల్ 1,2 తేదీల్లో ఎన్.బీ.ఏ బృందం మూడు రోజుల పాటు పర్యటించి కళాశాలలోని సౌకర్యాలు, ఉత్తీర్ణత శాతం, ఉపాధ్యాయుల పనితీరు, ప్రయోగశాల తదితర అంశాలను పరిశీలించినట్లు తెలిపారు. బృందం పర్యటనలో 1000 మార్కులకు 600లకు పైగా మార్కులు రావడంతో సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి మూడేండ్లు (2023-2026) పాటు ఎన్.బీ.ఏ గుర్తింపు లభించినట్లు పేర్కొన్నారు. గుర్తింపు రావడంతో కళాశాల విద్యార్థులు డిప్లొమో సర్టిఫికెట్ నాణ్యతా ప్రమాణాలు పెరిగి జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అన్నారు. అలాగే కళాశాలకు నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. గుర్తింపు రావడానికి సహకరించిన సాంకేతిక విద్యా కమిషనర్, జాయింట్ డైరెక్టర్, సెక్రటరీకి కళాశాల ప్రిన్స్పాల్ రవీందర్, హెచ్ఓడీ గంగారెడ్డి, అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు.