యాదగిరిగుట్ట, మే 29 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో కల్యాణమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి గజ వాహనంపై వేంచేపు సేవను కొనసాగించారు. తూర్పునకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని తిలకించారు. స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 3:30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. తిరువారాధన జరిపి స్వామి, అమ్మవార్లకు బాలభోగం జరిపారు. స్వయంభూ నారసింహుడికి నిజాభిషేకం నిర్వహించి, భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను గరుఢ, తిరుచ్చి వాహనాలపై వేంచేపు చేసి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. రాత్రి దర్భార్ సేవ, నివేదన, శయనోత్సవం సేవ అత్యంత వైభవంగా సాగింది. రామలింగేశ్వర కుటుంబంతోపాటు ఆలయంలో స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నరపాటు జరిపారు. సాయంత్రం రామలింగేశ్వరుడిని శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సుమారు 20వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 30,36,468 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
నేడు హుండీ లెక్కింపు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి హుండీని మంగళవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ఉదయం 7గంటలకు కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపం హాల్-2లో లెక్కింపు చేస్తారని వెల్లడించారు.