చింతపల్లి, సెప్టెంబర్ 29 : నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం హైదరాబాద్ – నాగార్జునసాగర్ హైవే పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా మరొక యువకుడు ప్రాణాలతో బయటబడ్డాడు. హైదరాబాద్ నుండి దేవరకొండకు నలుగురు యువకులు ఆటోలో వస్తున్నారు. చింతపల్లి మండలం నరసర్లపల్లి వద్దకు రాగానే ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టి ఎదురుగా వస్తున్న కార్లను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొక యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న యువకులు దేవరకొండ మండలం వడ్త్యా తండాకు చెందిన వారుగా గుర్తించారు.