నల్లగొండ, మార్చి 6 : వేసవి వచ్చిందంటే మనుషులతోపాటు పశువులూ వడదెబ్బతో అనారోగ్యానికి గురవుతుంటాయి. ఈ సారి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ సూచిస్తున్నది. ఇందుకోసం హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ను విడుదల చేసింది. ముఖ్యంగా కృత్రిమ గర్భధారణతో జన్మించిన పశువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని యాజమాన్యానికి తెలిపింది. గొర్రెలు, మేకలు, కోళ్లనూ అదేరీతిన కాపాడుకోవాలని పేర్కొంది.
ఈ వేసవి పూర్తయ్యే వరకు పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా చూడాల్సిన బాధ్యత పశు పోషణదారులపై ఉంది. అధిక ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవటం, షెడ్లలో అధిక సంఖ్యలో కిక్కిరిసి పోవడం, ఉక్కపోత, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం మూలంగా పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి సరిగా నడవలేక తూలి పడిపోతాయి. జీర్ణ ప్రక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఆహారం తక్కువగా తీసుకోవడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాధి నిరోదక శక్తి తగ్గిపోవడంతో ఇతర వ్యాధులు, పరాన్న జీవులు ఆశించే అవకాశముంది. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటల్లో ఉన్న నీటిని తాగడంతో పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు సంభవిస్తాయి. చూడి పశువుల్లో గర్భస్రావం, వడదెబ్బకు గురైన వాటిలో దాహం పెరగడం, తూలుతూ నడుస్తూ పడిపోవటం, రొప్పుతూ ఉండటంతో పాటు శ్వాస కష్టమై ఒక్కోసారి అపస్మారక స్థితికెళ్లి మృతిచెందే అవకాశముంది.
పచ్చి గడ్డే మేలు..
వేసవిలో సులువుగా జీర్ణమయ్యే గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడంతో పాటు ఎక్కువ శాతం పచ్చిమేత ఇవ్వాలి. పచ్చిగడ్డి ఉద యం, ఎండు గడ్డి రాత్రి సమయాల్లో ఇస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది. పశువుల్ని మేపేందుకు ఉదయం 6 నుంచి 10గంటల వరకు సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు బయటకు పంపడం మంచిది.
చల్లటి నీరే తాగించాలి
వేసవి పూర్తయ్యే వరకు పశువులకు తాగేందుకు చల్లటి నీరే ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. వేసవి తాపానికి గురైన పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశముంది. వ్యాధి నిరోధక టీకాలు వేయించని పశువులు, జీవాలకు వేయించాలి. దాహంతో ఉన్న పశువులు మురుగు నీరు తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ రోగం వచ్చే అవకాశం ఉన్నందున ఎల్లవేళలా చల్లటి నీరు తాగించాలి. అంతర పరాన్న జీవులు నిర్మూలనకు నట్టల నివారణ మందులు క్రమంగా తాగించాలి. వడదెబ్బకు గురైతే ప్రథమ చికిత్స చేయించాలి.వాటిని గాలి వీచే ప్రాంతానికి తీసుకెల్లి శరీర ఉష్ణోగ్రత తగ్గించే చర్యలు చేపట్టాలి. వైద్యుడి సహకారంతో గ్లూకోజ్ స్లైన్, సోడియం క్లోరైడ్ అందించటంతో పాటు శరీర ఉష్ణోగ్రత తగ్గే వరకు అవసరమైన చికిత్స చేయాలి.
వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి
ప్రస్తుతం గతం కంటే ఎండ ప్రభావం తీవ్రంగా ఉన్నందున పెంపకందారులు పశువులు, జీవాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులకు వడదెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మేత విషయంలో పచ్చి గడ్డికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, చల్లని నీరు తాగించాలి. చల్లటి వాతావరణంలోనే మేతకు బయటకు పంపించాలి. ఈ రెండు నెలలు పశువులు, జీవాలని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది.
– శ్రీనివాస్రావు, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు, నల్లగొండ