యాదగిరిగుట్ట, ఆగస్టు 4 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి స్వామిని గరుఢ వాహనం, అమ్మవారిని తిరుచ్చి సేవపై తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. స్వయంభువుడి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. ఆలయ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమాన్ని పాంచరాత్రగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. ఉదయం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శ నారసింహ హవనం జరిపారు.
వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవ చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరు కల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. ముత్తయిదువులు మంగళ హారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలలో శయనింపు చేశారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కార్యక్రమం కోలాహలంగా నిర్వహించారు.