– మునుగోడు మండల అధికారులకు గుండ్లోరిగూడెం సర్పంచ్ జంగిలి సునీత వినతి
మునుగోడు, జూన్ 05 : మునుగోడు మండల పరిధిలోని గుండ్లోరిగూడెం గ్రామంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తమపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, గ్రామస్తులను తప్పుదోవ పట్టించడానికి కొంతమంది చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని బీఆర్ఎస్ సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య అన్నారు. జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని గుండ్లోరిగూడెం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన భర్త జాతీయ జెండా ఎగురవేశారని వస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు. వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్, మునుగోడు మండల పరిషత్ అధికారికి, మండల పంచాయతీరాజ్ అధికారికి, తాసీల్దార్కు ఆమె వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సునీత మాట్లాడుతూ.. జాతీయ జెండాను ఎగురవేశారని తమ గ్రామానికి చెందిన తమకు పడని వ్యక్తులు తమ గెలుపును జీర్ణించుకోలేక కలెక్టర్కు ఫిర్యాదు చేశారని వాపోయారు. పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందిస్తూ కలెక్టర్కు, మండల అధికారులకు వివరణ ఇవ్వడం జరిగిందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు తమపై ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు తాము దళిత మహిళా సర్పంచ్ అని హేళన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గ్రామస్తులను తప్పుదోవ పట్టించడానికి కొంతమంది వ్యక్తులు తన భర్త జెండా ఎగరవేశారని చేస్తున్న ప్రచారం అవాస్తవం అన్నారు. గ్రామస్తులు ఇది గమనించాలని కోరారు.
జెండా ఎగరవేసే క్రమంలో అక్కడ ఉన్న చెట్టు కొమ్మకు జెండా తాడు తగిలి ఆగడంతో తన భర్త పక్కకు అనే క్రమంలో జెండా ఎగరడం జరిగిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తన భర్త జెండా ఎగరవేయలేదని, అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. సర్పంచ్గా ఎన్నికైన నాటినుండి గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి సౌకర్యం, వీధి దీపాల నిర్వహణ, గ్రామ అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమపై వస్తున్న అసత్య ఆరోపణలు ప్రచారాలను పరిగణలోకి తీసుకోకుండా ఉండాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆమె వెంట ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఉన్నారు.