హాలియా, సెప్టెంబర్ 5 : రాష్ట్రంలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే తాము పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నట్లు మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమల్ల సత్యం అన్నారు. మంగళవారం హాలియా లక్ష్మీనర్సింహ గార్డెన్లో నిర్వహించిన మాలమహానాడు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏడ్లు గడిచినా నేటికీ దళితులు వెనుకబడడానికి గతంలో రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టే కారణమన్నారు. గత పాలకులు దళితులను ఓటు బ్యాంక్గా మాత్రమే చూశారే తప్ప వారి అభ్యున్నతి కోసం పాటుపడలేదన్నారు.
తెలంగాణ ఏర్పాటై బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే దళితులకు మేలు జరుగుతున్నదని పేర్కొన్నారు. దళితబంధు పథకం తీసుకొచ్చి రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల అందించడం వల్ల వారు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దళితులకు సముచిత గౌవరం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
దేశం గర్వించే విధంగా హైదరాబాద్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎతైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కుమార్కు మాలలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. జానారెడ్డి ఏడు సార్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా పని చేసినా దళితులకు చేసిందేమీ లేదన్నారు.
అనంతరం ఎమ్మెల్యే నోముల భగత్కుమార్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సమావేశంలో ఏకగీవ్రంగా తీర్మానించారు. కార్యక్రమంలో నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కామర్ల జానయ్య, మాలమహానాడు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జంగాల లక్ష్మి, జిల్లా అధ్యక్షుడు లక్కుమల్ల మధుబాబు, బైరం కృష్ణ, పురం వేణు, లకుమల్ల లింగయ్య, చల్మారెడ్డిగూడెం సర్పంచ్ కామల్ల శేఖర్, రాములు, చింతమల్ల పాండురంగయ్య, బైరం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, వెంకట రాములు, శ్రీను, బైరం రవి, మల్లేశ్, నర్సింహతో పాటు 500 మంది మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.