ఉమ్మడి జిల్లాలో గురువారం వడగండ్ల వాన కురిసింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పిడుగులు పడ్డాయి. చందంపేట మండలం బొల్లారంలో పిడుగుపాటుకు తాటిచెట్టు దగ్ధమైంది. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డులో ఇంటిపై పిడుగు పడడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు కనగల్లో నాలుగు సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
– నల్లగొండ, మార్చి 16
నల్లగొండ /మర్రిగూడ/ నాంపల్లి/ చం దంపేట, మార్చి 16: నల్లగొండ జిల్లాలో గురువారం ఆయా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతగా ఉండగా సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు చోటు చేసుకో+ని చల్లబడి వర్షం పడింది. జిల్లా కేంద్రంతో పాటు కనగల్లో4 సెంటి మీటర్ల వర్షం పడగా మిర్యాలగూడ, నాంపల్లి, మర్రిగూడ, పీఏ పల్లి అనుముల మండలాల్లో 2 సెంటీ మీటర్ల వర్షం పడింది. మిగిలిన మండలాల్లో ఒక సెంటిమీటర్ మేరకు కురిసింది. సాయంత్రం నుంచి వర్షం పడడానికి కంటే ముందే ఈదరు గాలులు ప్రారంభం కాగా పలు ప్రాంతాల్లో వర్షం పడేటప్పుడు వడగండ్లు పడ్డాయి. ఇప్పటి వరకు 35 నుంచి 37 డిగ్రీల ఎండతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరట నివ్వడంతో ప్రజలు చల్లదనాన్ని చక్కగా ఆస్వాదించారు. వర్షంతో పాటు ఈదురు గాలులు పాక్షికంగానే ఉండడంతో ఎలాంటి నష్టం జరగలేదు. చందంపేట మం డలంలోని బొల్లారం పట్టి గ్రామంలో పిడుగు పాటుకు తాటి చెట్టు దగ్ధమైంది.
ఇంటిపై పిడుగుపడి సామగ్రి దగ్ధం
మిర్యాలగూడ : పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలోని గంట శ్రవణ్రెడ్డి ఇంటిపై గురువారం రాత్రి పిడుగు పడడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. విద్యుత్ వైర్లకు మంటలు అంటుకోగా స్థానికుల సాయంతో ఆర్పివేశారు. సుమారు రూ.9 లక్షల విలువైన సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఆర్డీఓ చెన్నయ్య, డీఎస్పీ వెంకటగిరి ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు.
భువనగిరిలో చిరు జల్లులు
భువనగిరి అర్బన్ :భువనగిరి పట్టణంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిరు జల్లులు పడ్డాయి. ఉదయం నుంచి మబ్బుగా ఉన్న ఆకాశం మధ్యాహ్నం సమయంలో మేఘావృతమై చల్లనిగాలి వీయడంతో 30 నిమిషాల పాటు చిరు జల్లులు కురిశాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.