మిర్యాలగూడ రూరల్ : డిసెంబర్ 18 : స్వరాష్ట్రంలో కేజీ టు పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ గురుకుల పాఠశాలలు రెండు మాత్రమే ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2017లో సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 119 బీసీ గురుకులాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య చేరువ చేశారు. ఒక్కో స్కూల్లో 480 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. వాటిని ఇంటర్మీడియట్కు అప్గ్రేడ్ చేయడంతో బాలికల చదువు డ్రాపవుట్ లేకుండా సాగుతున్నది.
65ఏండ్ల సమైక్య పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీసీలకు రెండు గురుకుల పాఠశాలలు (నాగార్జున సాగర్, మూసీ) మాత్రమే ఉండేవి. దాంతో పేద విద్యార్థులకు గురుకుల చదువు అందని ద్రాక్షగానే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 12 బాలుర, 12 బాలికల పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఆ తరువాత నల్లగొండ మూడు జిల్లాలుగా విభజన చేయడంతో జిల్లాకు ఒకటి చొప్పున మరో మూడు కొత్త గురుకుల స్కూళ్లను ప్రభుత్వం నెలకొల్పింది.
దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు పాత స్కూళ్లతోపాటు బాలుర 14, బాలికలవి 12.. మొత్తం 29 బీసీ గురుకుల పాఠశాలలు అందుబాటులోకి వచ్చా యి. వాటిల్లో 16,800 మంది విద్యార్థులు ఉచితంగా వసతి పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. వీటికి అనుబంధంగా 26 జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. గురుకులాల్లో కార్పొరేట్ స్థాయి విద్యతోపాటు పౌష్టికాహారం అంది స్తూ ఐఐటీ, నీట్, ఎంసెట్ కోచింగ్ సైతం ఇస్తున్నారు. దీంతో గురుకులాల విద్యార్థులు ఐఐటీ, బీటెక్, మెడిసిన్ సీట్లు సాధించి తమ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, ఖర్చుల భారంతోపాటు బాలికల భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గురుకుల పాఠశాలల్లో ఉచిత వసతి, పౌష్టికాహారంతోపాటు ఇంగ్లిషు మీడియంలో విద్య అందిస్తున్నారు. విద్యార్థుల శారీరక దారుఢ్యానికి వ్యాయామం, మానసిక వికాసానికి క్రీడలు, యోగా, మెడిటేషన్ చేయిస్తున్నారు. దీంతో గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి డిమాండ్ పెరుగుతున్నది. 2017లో ప్రారంభమైన బీసీ గురుకుల పాఠశాలల్లో 10వ తరగతి నుంచి ఇంటర్కు అప్గ్రేడ్ చేయడంతో ఉన్నత చదువులు చదివేందుకు పేద విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
గురుకుల పాఠశాలల్లో సీటు రావడంతో 6వ తరగతిలో చేరిన విద్యార్థులు పదో తరగతి వరకు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా అందులోనే చదువుతున్నారు. ఉచితంగా అన్ని సౌకర్యాలతో విద్య అందుతుండడంతో చదువు మధ్యలో మానేయడం తగ్గింది. ఉత్తమ విద్య అందడంతో గురుకులాల విద్యార్థులు ఎంసెట్, పాలిటెక్నిక్, ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు. దీని మూలంగా బాల్య వివాహాలను చెక్ పడినట్లయింది.
మాది నకరేకల్ మండలం చందుపట్ల. నేను ఆరో తరగతి నుంచి దామరచర్ల గురుకుల స్కూల్లో చదువుతున్నా. మాది నిరుపేద కుటుంబం. మా నాన్న చనిపోయాడు. మా అమ్మ కూలినాలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. నన్ను ప్రైవేటు స్కూల్లో చదివించే స్థోమత లేదు. గురుకుల పాఠశాలలో సీటు రాకపోతే నా పరిస్థితి మరోలా ఉండేది. సీఎం కేసీఆర్ మాలాంటోళ్లు బాగా చదువుకోవాలని, బాగుపడాలని గురుకుల పాఠశాలలు పెట్టాడు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా. ఇక్కడే ఇంటర్ వరకు చదువుతాను. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించి మా అమ్మను బాగా చూసుకుంటా.
– వరికుప్పల రమణ, 10వ తరగతి, దామరచర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్య పరంగా రాష్ట్రం వెనుకబడి ఉన్నది. పేద, మధ్య తరగతి పిల్లలకు చదువుకొనే ఏర్పాట్లు చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సాహసోపేతమైన అడుగు ముందుకేశారు. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 119 గురకులాలు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. ఆ గురుకులాలు పేద విద్యార్థుల పాలిట వరమయ్యాయి. గతంలో మధ్య తరగతి విద్యార్థులకు చదువుకోవాలని ఉన్నా.. వసతులు లేక తల్లిదండ్రులు చదువు మాన్పించి పనులు చేయించేవారు. నేడు ఆ పరిస్థతి లేదు. నియోజకవర్గానికి రెండు బాల, బాలికల గురుకులాలు, మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ గురుకుల పాఠశాలలు నెలకొల్పడంతో పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా ఈ గురుకులాలు బాలికలకు ఒక వరమనే చెప్పాలి.
– కొండకింది నర్సింహారెడ్డి, దామరచర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్