అడవిదేవులపల్లి, సెప్టెంబర్ 19 : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.5 లక్షల జడ్పీ నిధులతో నిర్మించిన ఆర్చ్, ప్రహరీని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రారంభించారు.
అనంతరం స్థానిక రైతువేదికలో మండల వ్యాప్తంగా మాడా- ట్రైకార్ పథకం కింద 74 మంది గిరిజనులకు మంజూరైన రూ.91.25 లక్షల విలువైన చెక్కులు, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహాసుర, అసైన్డ్ భూముల పట్టాలను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజనులకు పోడుపట్టాల పంపిణీ, పది శాతం రిజర్వేషన్ అమలు, హైదరాబాద్లో బంజారా భవన్ నిర్మాణం, మారుమూల తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
కృష్ణపట్టె రైతుల చిరకాల వాంఛ అయని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు రూ.300 కోట్లతో దున్నపోతులగండి, చిట్యాల ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే భాస్కర్రావు మంజూరు చేయించి పనులను శరవేగంగా చేపట్టడం జరుగుతుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాస్కర్రావుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి అడవిదేవులపల్లి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మండలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రారంభించుకున్నామని, పెండింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించి బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు పలకాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్, జడ్పీటీసీ కుర్రా సేవ్యానాయక్, తాసీల్దార్ సురేశ్, ఎంపీడీఓ మసూద్షరీఫ్, ఆర్ఐ రామకృష్ణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల చినరామయ్య, సర్పంచ్ కొత్తా మర్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ బండి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనునాయక్, ఎంపీటీసీలు కుర్రకాంతి కృష్ణకాంత్, పేర్ల లింగయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సూర్యానాయక్, కోఆప్షన్ సభ్యుడు బాబుజాని, సర్పంచ్లు బాబూనాయక్, రామారావు, బాల, పకీరా, పెరుమాళ్ల శ్రీనివాస్, కేశబోయిన కొండల్, హరినారాయణ, స్వామి, నాయకులు పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి మండలాభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే భాస్కర్రావు