భువనగిరి అర్బన్, డిసెంబర్ 21 : ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే తాసీల్దార్లను ఆదేశించారు. ఓటరు జాబితా రూపకల్పనపై కాన్ఫరెన్స్లో మంగళవారం తాసీల్దార్లతో సమావేశమై ఓటరు జాబితా తయారీపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1, 2024 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 యేండ్లు నిండిన ప్రతి ఒకరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ చేయాలని, ఓటరు జాబితాలో మరణించిన ఓటర్ల వివరాలు తొలగింపు, ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమోగ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో ఈనెల 20 వరకు ఆన్లైన్లో సవరించాలని అధికారులను ఆదేశించారు. ఫొటో సరిగా లేకున్న ఇంటి అడ్రస్ తప్పు ఉన్నా, కొత్త ఓటరుగా 30 ఏండ్ల పైబడిన వారిని పాత పోలింగ్ కేంద్రాల్లో ఎకడైనా ఓటు ఉందా అని విచారించి ఫారం -8 ద్వారా దరఖాస్తు చేయించాలని తెలిపారు. జనవరి 6, 2024న ముసాయదా ఓటరు జాబితా విడుదల చేసి, జనవరి 22, 2024 వరకు సదరు జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. ఫిబ్రవరి 8, 2024న తుది ఓటరు జాబితా రూపొందించాలని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి, తాసీల్దార్లు పాల్గొన్నారు.
మొబైల్ మెడికేర్ యూనిట్ ప్రారంభం
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీకి అందజేసిన నూతన మొబైల్ టెస్టింగ్ వ్యాన్ను జిల్లా కలెక్టర్ జెండగే మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాలలో 60 సం.లు పైబడిన వయోవృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి ఉచితంగా మందులు అందచేయడం అభినందనీయమని తెలిపారు.జిల్లాలో రెడ్ క్రాస్ కార్యక్రమాలను విసృ్తతపరచాలని, అలాగే వీలైనన్నీ రక్తదాన శిబిరాలను నిర్వహించాలని సూచించారు. రెడ్ క్రాస్ చేపట్టబోయే కార్యక్రమాల్లో తాను తప్పకుండా పాల్గొనే విధంగా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, డివిజన్ కమిటీ అధ్యక్షులు సద్ది వెంకటరెడ్డి, జిల్లా కమిటీ డైరెక్టర్లు షేక్.హమీద్ పాశ, జంపాల అంజయ్య, రెడ్ క్రాస్ సభ్యులు ఎస్పీ యుగేంధర్ రావు, స్పందన, రాం రెడ్డి, విజయ్ కుమార్, జయలక్ష్మి, మశ్చేందర్ తదితరులు పాల్గొన్నారు.