యాదగిరిగుట్ట, మార్చి 7 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం వసంతోత్సవం(హోలీకోత్సవం) అత్యంత వైభవంగా జరిగింది. పవిత్ర రోజైన పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున హోలీ పండుగ సందర్భంగా ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలు, ప్రత్యేక అభరణాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్య మనోహరంగా అలంకరించి తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. సుమారు గంటపాటు సాగిన ఉత్సవంలో ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు పాల్గొని వసంతోత్సవ వేడుక విశిష్టతను భక్తులకు వివరించారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ వేడుకలు జరుపుకొన్నారు.
అనంతరం స్వామివారికి తిరువీధి సేవ జరిపారు. స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శ నారసింహ హోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు.
ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. రాత్రి స్వామివారి తిరువరాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన నిర్వహించారు. పాత గుట్ట స్వామివారికి నిత్యారాధనలు జరిగాయి. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ నిర్వహించారు. స్వామివారిని సుమారు 16 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి ఖజానాకు రూ.22,61,887 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామి సేవలో ఐఏఎస్ అధికారులు..
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి సేవలో రాష్ట్ర ఐఏఎస్ అధికారులు పాల్గొని తరించారు. రాష్ట్ర ఆర్ అండ్ బీ సెక్రటరీ కె.ఎస్. శ్రీనివాసరాజు, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్రావుతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం యాదగిరిగుట్టకు చేరుకున్న వారు స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం రాష్ట్ర ఆర్ అండ్ బీ సెక్రటరీ కె.ఎస్. శ్రీనివాసరాజు, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్రావు తిరువీధిసేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ డీఈఓ దోర్బల భాస్కర్ వారికి స్వామివారి ప్రసాదం అందజేశారు. అలాగే నృసింహుడిని శ్రీశైల దేవస్థాన పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పవిత్రమైన వజ్ర సంకల్పాన్ని దేశ, విదేశాల తెలుగు భక్తులు ప్రశంసిస్తున్నారని పేర్కొనారు.