గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే ఒక విడుత అందజేయగా, రెండో విడుతకు శ్రీకారం చుడుతున్నది. శుక్రవారం ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గొర్రెల పంపిణీని ప్రారంభించనున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సంక్షేమ సంబురాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ధరలు పెరుగడంతో గొర్రెల యూనిట్ విలువను ప్రభుత్వం రూ. 1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచింది. 75శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందజేయనున్నది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తొలి విడుతలో 18,420 మందికి, మునుగోడు నియోజకవర్గంలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 5,600 మందికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు.
యాదాద్రి భువనగిరి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : గొల్ల కురుమల కుటుంబాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతుదన్నది. జీవనోపాధి కల్పించేలా చేయూతనిందిస్తున్నది. ఇప్పటికే తొలి విడుతలో గొర్రెల పంపిణీ చేయగా, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేటి నుంచి రెండో విడుత పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. ఆలేరులో విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, భువనగిరిలో ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గొర్రెలను పంపిణీ చేయనున్నారు.
గొల్ల,కురుమలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని 2017లో రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద సర్కారు 75 శాతం సబ్సిడీ అందిస్తున్నది. ఒక్కో యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందిస్తున్నది. యూనిట్ ఖర్చు రూ.1.25 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో లబ్ధిదారులు తన వాటా కింద రూ. 31,250 డీడీ తీయాలి. ప్రభుత్వం 93,750 సబ్సిడీ ఇచ్చేది. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమల్లోకి వచ్చి ఐదేండ్లు అవుతుండగా ధరల్లో అప్పటికీ.. ఇప్పటికీ తేడా ఉంది. గొర్రె పిల్లల ధరలు పెరిగిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ ఖర్చును పెంచింది. ఇప్పటి వరకు ఉన్న రూ1.25 లక్షల యూనిట్ ఖర్చును రూ. 1.75 లక్షలకు పెంచింది. మొత్తం యూనిట్ ఖర్చులో లబ్ధిదారులు రూ. 43,250 చెల్లించాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,31,750 చెల్లించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుతలో గొర్రెలను పంచేందుకు సిద్ధమైంది. పంపిణీకి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి గొర్రెలను రవాణా చేయనుంది. రెండో విడుతలో భాగంగా జిల్లాలో 15,390 యూనిట్లు పంపిణీ చేయనున్నారు. అంటే జిల్లా వ్యాప్తంగా 3 లక్షల గొర్రెలను పంచనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 270 కోట్లను ఖర్చు చేయనుంది. కాగా మొదటి విడుతలో భాగంగా జిల్లాలో 18,420మందికి యూనిట్లు అందించారు. అంటే 3,64,000 గొర్రెలతో పాటు 15 వేల పొట్టేళ్లను గొల్లకురుమలకు పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో దానిని ఆ నియోజక వర్గం వరకు పూర్తి చేశారు. ఇందుకోసం రూ. 172 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. దీంతో గొర్రెల మందలు విపరీతంగా పెరిగిపోయాయి. అనేక చోట్ల డబుల్, ట్రిబుల్ అయ్యాయి. గొల్ల, కురుమలకు ఎంతగానో ఉపాధి లభించింది. అయితే ప్రభుత్వం గతేడాది నవంబర్లోనే మునుగోడు నియోజక వర్గాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేయతలపెట్టింది.అందులో భాగంగా 5,600ల మందికి గొర్రెలను పంపిణీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కేవలం గొర్లు ఇచ్చి చేతులు దులుపేసుకోవడంలేదు. అవి చనిపోతే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నది. ఇందుకోసం ముందుగా బీమా చేస్తున్నది. మరణించిన గొర్రె స్థానంలో మరొకటి కొనుగోలు చేసి ఇస్తున్నది. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చే గొర్రె పిల్లకు రవాణా చార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తున్నది. అంతేకాకుండా గొర్రెల కోసం మెడిసిన్ కిట్ అందిస్తూ.. గొర్రెల ఫీడింగ్ సౌకర్యం కల్పిస్తున్నది.