మాడ్గులపల్లి, ఫిబ్రవరి 12 : వర్షపు నీటిని ఒడిసి పట్టి, నీటి వృథాను అరికట్టి వ్యవసాయ భూములకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు, చెక్డ్యామ్ల నిర్మాణం చేపడుతున్నది. ఇందులో భాగంగా మాడ్గులపల్లి మండలంలోని పాలేరు వాగుపై నాలుగు చెక్డ్యామ్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి కాగా.. మిగతావి ముమ్మరంగా సాగుతున్నాయి. గత సీజన్లో కురిసిన వర్షాలకు భారీగా వరద వచ్చి చేరడంతో చెక్డ్యామ్లు జలకళను సంతరించుకున్నాయి. దీంతో మండల ప్రజలకు సాగు, తాగునీటికి ఢోకా లేకుండా పోయింది.
మాడ్గులపల్లి మండలంలో పాలేరు వాగుపై రూ.15.78 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు చెక్డ్యామ్ల నిర్మాణం చేపట్టింది. చిరుమర్తి గ్రామంలో రూ.3.50కోట్లు, ఆగామోత్కూర్లో రూ.3కోట్లు, బొమ్మకల్లో రూ.3.35కోట్లు, సల్కునూరులో 3.12కోట్ల రూపాయలతో చెక్డ్యామ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే బొమ్మకల్ చెక్డ్యామ్ నిర్మాణ పనులు పూర్తికాగా.. ఆగామోత్కూర్, చిరుమర్తి, సల్కునూరు గ్రామాల్లో పనులు చివరి దశకు చేరుకున్నాయి. వీటి నిర్మాణంతో సుమారు 2వేల ఎకరాలకు పైగా బీడు భూములు సాగులోకి రానున్నాయి. భూగర్భ జలాలు పెరిగి సమీప గ్రామాలైన కల్వలపాలెం, బొమ్మకల్, ఆగామోత్కూర్, సల్కునూరు, భీమనపల్లి, చిరుమర్తి గ్రామాల ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ వేసవిలోనే భూగర్భ జలాలు పెరిగాయని ఆయా గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మండలంలో చేపడుతున్న చెక్డ్యామ్ల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగి సాగునీటి కష్టాలు తీరాయి. పాలేరు వాగు వెంట ఉన్న సమీప గ్రామాల భూములకు సాగునీరు అందడంతోపాటు వేసవిలో ప్రజలకు, పశువులకు తాగునీటి ఇబ్బందులు తప్పాయి. ప్రభుత్వం సాగు నీటి సమస్య లేకుండా, వర్షపు నీరు వృథా కాకుండా చెక్డ్యామ్ల నిర్మాణం చేపట్టడం సంతోషకరం. వాటితో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి.
– బీసం మల్లికార్జున్, రైతు, కల్వలపాలెం
మండలంలో చేపడుతున్న చెక్డ్యామ్ల నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. పెండింగ్
పనులను ఈ వేసవిలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. కోట్ల రూపాయలతో చేపట్టే చెక్డ్యామ్ల నిర్మాణాలతో మండలంలో సుమారు 2వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి. దీంతో మండల ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి.
– సాయిరెడ్డి, ఇరిగేషన్ ఏఈఈ