నిడమనూరు, ఏప్రిల్ 9 : ఓ యువతిని ప్రేమించిన యువకుడిని యువతి బంధువులు ముందస్తు పథకం ప్రకారం వెంటాడి దారుణంగా హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నంగా చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం జి.అన్నారం గ్రామానికి చెందిన ఇరిగి నవీన్(21) అదే గ్రామానికి చెందిన వేరే కులం యువతి నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. మిర్యాలగూడ పట్టణంలో కారు మెకానిక్గా పని చేస్తున్న నవీన్ ప్రేమ వ్యవహారం యువతి కుటుంబ సభ్యులకు గత ఏడాది తెలిసింది. దాంతో నవీన్ను యువతి బంధువులు పలుమార్లు హెచ్చరించారు. యువతిని కట్టడి చేసిన ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతి సైతం నవీన్తో మాట్లాడటం మానేసింది. మనస్థాపానికి గురైన నవీన్ పక్షం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఇటీవలే కోలుకున్నాడు. తిరిగి యువతితో మాట్లాడేందుకు యత్నిస్తున్నాడన్న కారణంతో ప్రతి ఆదివారం గ్రామానికి వచ్చే నవీన్ను యువతి బంధువు కొడదల శివప్రసాద్ మూడ్రోజుల క్రితం ఫోన్లో హెచ్చరించాడు.
ఈ క్రమంలో నవీన్ గుంటిపల్లి గ్రామంలో తనకు సన్నిహితుడైన పాల్వాయి తిరుమల్ ఇంటికి మరో స్నేహితుడు ఈట అనిల్తో కలిసి ఆదివారం బైక్పై వెళ్లారు. ఎలాగైనా యువతి కుటుంబాన్ని ఒప్పించి తమ పెళ్లి జరిగేలా మధ్యవర్తిగా వ్యవహరించాలని తిరుమల్ను కోరారు. ముగ్గురు కలిసి బీర్లు తాగుతూ మాట్లాడుకుంటున్న సమయంలో జి.అన్నారంలోని యువతి బంధువులు నవీన్కు ఫోన్ చేసి సామరస్యంగా మాట్లాడుకుందామని నమ్మబలికారు. దాంతో తాను గుంటిపల్లిలో ఉన్నానని, ఇక్కడికి రమ్మని నవీన్ చెప్పడంతో మూడు బైక్లపై వచ్చిన తొమ్మిది మంది హఠాత్తుగా కర్రలతో దాడి చేశారు. భయకంపితులైన అనిల్, తిరుమల్ గ్రామంలోకి పరుగెత్తారు. నవీన్ వెంట పడిన లింగంపల్లి రాజేశ్, మర్రి రాజు, కొడదల శివప్రసాద్, కొడదల మణితేజ, తాళ్ల నవదీప్తోపాటు మరికొందరు నవీన్పై కత్తులతో అతికిరాతకంగా దాడి చేయగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, హాలియా సీఐ గాంధీనాయక్, నిడమనూరు ఎస్ఐ శోభన్బాబు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన తీరును పరిశీలించిన డీఎస్పీ ఘటనకు గల కారణాలపై ఆరా తీసి శవ పంచానామా నిర్వహించారు. క్లూస్ టీం బృందాన్ని రప్పించి ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. నవీన్ మృత దేహంపై 11 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యానంతరం నిందితులు మృతుడి సెల్ఫోన్ను ధ్వంసం చేసినట్లు భావించారు. అనంతరం మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.