భువనగిరికలెక్టరేట్, డిసెంబర్ 23 : పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, టీఎస్ఎంఎస్, ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. వచ్చే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతాశాతం పెరిగేలా పునశ్చరణ తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహించాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అన్నారు. ప్రతి రోజూ విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం బోధించాలని సూచించారు. ప్రభుత్వం మన ఊరు.. మన బడి కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పిస్తున్నదని, పాఠశాలలను ఆహ్లాదంగా మార్చాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. కిచెన్ గార్డెన్లు అభివృద్ధి చేయడంలో విద్యార్థులకు సైతం మొక్కల పెంపకంపై అవగాహన ఏర్పడుతుందన్నారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ల ద్వారా పండించిన కూరగాయలను మధ్యాహ్న భోజనంలో వినియోగించడం పట్ల కేంద్ర ప్రభుత్వ పరిశీలన బృందాలు అభినందించినట్లు చెప్పారు.
బుధవారం బోధన కార్యక్రమం ద్వారా అభ్యసన పద్ధతులు పిల్లలకు ఉపయోగపడుతాయని, బిగ్గరగా చదివించడం వలన పిల్లలకు గుర్తుండిపోతాయన్నారు. తల్లిదండ్రు లతో సమావేశమై వారికి అన్ని విషయాలను వివరించాలన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో విద్యాబోధన చేసేందుకు కమ్యూనిటీ యువతకు భాగస్వాములను చేశామని, వారిని ప్రోత్సహించి సహకారం అందించాలని సూచించారు. వచ్చే మూడు నెలల్లో వెనుకబడిన పిల్లలపై శ్రద్ధ పెట్టి వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్న దాతలను జిల్లా యంత్రాంగం తగిన రీతిలో గౌరవిస్తుందని తెలిపారు. సమావేశంలో డీఈఓ కే. నారాయణరెడ్డి, సెక్టోరియల్ అధికారి నీరుడు ఆండాలు, పీపుల్ ఫర్ ఇండియా కోఆర్డినేటర్లు అరవింద్, విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.