సర్కారు పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఖాళీలను వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం
దానికి సంబంధించిన టీఆర్టీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీఈడీ, డీఈడీ అభ్యర్థుల్లో ఆశలు చిగురింపజేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 503 టీచర్ల పోస్టులు భర్తీ కానున్నాయి. గతంలో టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టగా ఈ సారి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీతో చేయనున్నారు. ఈ నెల 20నుంచి అక్టోబర్ 21వరకు బీఈడీ, డీఈడీతోపాటు టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 20నుంచి పది రోజులపాటు కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్(సీబీఆర్టీ) విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల వైపు దృష్టి సారిస్తున్నారు. అందరికీ అవకాశం కల్పించేలా ప్రభుత్వం ఈ నెల 15న టెట్ నిర్వహిస్తుండగా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుక్రవారం వెల్లడించింది. టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2017లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం మరో మారు నోటిఫికేషన్ విడుదల చేయడంతో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగ సాధనకు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. మరో వైపు టెట్ వెయిటేజీ పెంచుకునేలా ఈ నెల 15న నిర్వహించే టెట్కు సిద్ధమవుతూనే టీఆర్టీకి ప్రిపేర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
నల్లగొండ జిల్లాలో 6,451 ఉపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 5,319 మంది టీచర్లు పని చేస్తు-ండగా.. 1,132 పోస్టులు ఖాళీ ఉన్నట్లు సమాచారం. అయితే.. ఇటీవల కొన్ని పాఠశాలలు మూతపడగా ఉపాధ్యాయుల సర్దు-బాటు అనంతరం జిల్లాలో 219 పోస్టుల భర్తీకి అవకాశం ఉన్నట్లు సమాచారం. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న వారి సంఖ్య తెలియాల్సి ఉన్నది.
డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)లో నలుగురు సభ్యులు ఉండనున్నారు. ఇందులో చైర్మన్గా జిల్లా కలెక్టర్, వైస్ చైర్మన్గా జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ), మెంబర్ సెక్రటరీగా డీఈఓ, సభ్యులుగా జడ్పీ సీఈఓ ఉంటారు. వీరి ఆమోదంతో జిల్లాలో ఖాళీలను వెల్లడించి పారదర్శకంగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. కాగా 14 నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులతోపాటు లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో టీఆర్టీ నిర్వహణ చేయనున్నారు.
టీఆర్టీకి దరఖాస్తు చేయాలంటే కచ్చితంగా టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే.. టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలో 100 మార్కులుండగా.. 80 మార్కులు రాత పరీక్షకు, 20 మార్కులు టెట్ వెయిటేజీకి ఇచ్చారు.
టీఆర్టీకి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20నుంచి అక్టోబర్ 21 వరకు కొనసాగనుంది. దరఖాస్తులు చేసిన అభ్యర్థులకు నవంబర్ 20నుంచి సీబీఆర్టీ విధానంలో రాత పరీక్షలు నిర్వహిస్తారు.