యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 25 : వారంరోజులుగా కొనసాగుతున్న పాత గుట్ట బ్రహ్మోత్సవాలు ఆదివారం పరిపూర్ణమయ్యాయి. లక్ష్మీనరసింహ స్వామికి ఆగమశాస్ర్తానుసారంగా వేదమంత్ర పఠనాలతో అష్టోత్తర శతఘటాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో 108 కలశాల్లో పంచామృతాలు, పవిత్ర తీర్థ జలాలు, సుగంధ ఫల రసాలు, నారికేళ జలాలను అభిమంత్రించి పవిత్ర ద్రవ్యాలతో, తీర్థరాజములతో కల్యాణోత్సవ మూర్తులను, మూలవరులను అభిషేకించారు. జీవ నదుల నుంచి తెప్పించిన జలాలతో సుమారు నాలుగు గంటల పాటు శ్రీవారికి అభిషేకం చేశారు. పంచభూతాల్లోని పృథ్వీజలాలు, వాయువు, తేజస్సుతత్వాలు ప్రకృతి నిండా ఆవరించిన ఫలభరిత మధుర రసాల సృష్టికి కారణభూతమైన 96 తత్వాలు(తిథి, వార, నక్షత్ర) పక్ష, మాస, సంవత్సర స్వరూపాలు, ద్వాదశాదిత్యులు తదితర 108 కలశాలతో పూజలు జరిపారు. కలశతీర్థం, పుణ్యజలానికి వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. ప్రధాన కలశంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు.
కలశ తీర్థం పుణ్యజలాన్ని కలిపి శ్రీవారికి అభిషేకం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు ఉత్సవ కైంకర్యాన్ని ఆలయ ఉప ప్రధానార్చకులు జరిపారు. అనంతరం ఉత్సవాల్లో పాల్గొన్న పారాయణిలను సన్మానించారు. ఉత్సవ నిర్వాహకులు, భక్తులకు మహదాశీర్వచనం జేసి బ్రహ్మోత్సవాలకు పరిపూర్ణం పలికారు. ఈ వేడుకల్లో ఆలయ ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ రామకృష్ణారావు, డీఈఓ దోర్బల భాస్కర్శర్మ, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, యాజ్ఞికులు కిరణ్కుమారాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు, శ్రీధరాచార్యులు, అధ్యాపకులు నల్లన్థీఘళ్ సీతామనోహరాచార్యులు, పారాయణందారులు నర్సింహాచార్యులు, జగన్మోహనాచార్యు లు, వేణగోపాలాచార్యులు, ఆలయ అధికారులు శ్రీకాంత్, విజయకుమార్ పాల్గొన్నారు.