కొండమల్లేపల్లి, డిసెంబర్ 26 : ఆడ శిశువును సాకడం భారంగా భావించిన ఆ దంపతులు శిశువును మరొకరికి ఇచ్చారు.. విషయం తెలు సుకున్న అధికారులు ఆ దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించి శిశువును తల్లి ఒడికి చేర్చారు. వివరాల్లోకి వెళ్తే.. పీఏపల్లి మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన కూర వెంకటయ్య, రేవతి దంపతులు కొండమల్లేపల్లిలో నివాసం ఉంటున్నారు.
పాత సామాన్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వెంకటయ్య దంపతులకు ఒక కుమారుడు, కుమార్తెతోపాటు ఆరు రోజుల క్రితం మూడో కాన్పులో ఆడ శిశువు జన్మించింది. అయితే శిశువును సాకడం భారంగా భావించిన ఆ దంపతులు నల్లగొండలో నివాసం ఉంటున్న వెంకటయ్య, నాగమణి దంపతులకు ఇచ్చారు.
కాగా శిశువు కనిపించకపోవడంతో గ్రామీణ రిసోర్స్ పర్సన్స్, చిల్డ్రన్ వెల్ఫేర్ అధికారులు సమాచారం తెలు సుకుని రేవతి దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దాంతో సోమవారం వారు శిశువును తిరిగి తెచ్చు కున్నారు. ఇదిలా ఉంటే శిశువును అమ్ముకున్నారన్న ఆరోపణలపై ఆ దంపతులు స్పందిస్తూ తాము తమ శిశువును అమ్ముకోలేదని, తెలిసిన వారికి పెంచుకునేందుకు ఇచ్చినట్లు పేర్కొన్నారు.