ఆత్మకూర్.ఎస్, జూన్ 7 : మండల పరిధిలోని కందగట్ల లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలోని దేవదేవుడికి ధూప దీప నైవేద్యమే కరువైంది. ఆలయ పూజారికి జీత భత్యాలూ అందడం లేదు. ఆలయానికి చెందిన 630 ఎకరాల భూమిని కౌలుకు ఇచ్చినా ఇక్కడి అర్చకుడికి కనీసం జీత భత్యాలు లేవు. కందగట్లకు చెందిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన 630 ఎకరాల భూమికి దాదాపు 21 సంవత్సరాలుగా కౌలు సక్రమంగా వసూలు చేయడం లేదు. కొందరు కౌలుదార్లు కౌలు చెల్లించకుండా భూమిని అనుభవిస్తున్నారు. కొంత భూమి ఆక్రమణకు గురైనట్లు మరికొందరు ఆరోపిస్తున్నారు. దీంతో దేవాలయానికి రావాల్సిన రూ.లక్షల ఆదాయానికి గండి పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దేవాలయానికి ఆదాయం లేకపోవడంతో 23 సంవత్సరాలుగా సేవలందిస్తున్న అర్చకుడికి అరకొర వేతనం చెల్లిస్తున్నారు. అర్చకులకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లించాలని జీవో 3లో పేర్కొన్నా అది అమలు కావడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారమై ఆలయ అర్చకుడు ఇబ్బంది పడుతున్నారు. గతంలో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయశాఖ వారు ఈవోకు పంపగా నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మళ్లీ స్థానికులు సమాచార హక్కు చట్టం ద్వారా అసిస్టెంట్ కమిషనర్కు దరఖాస్తు చేశారు.
గత 20 సంవత్సరాలుగా కౌలు బకాయిలు కౌలుదారుల నుంచి రెవెన్యూ రికవరీ రియాక్టు కింద వసూలు చేయించి దేవాదాయ శాఖకు జమ చేయాలని కోరుతున్నారు. ఆక్రమణలో ఉన్న దేవాలయ భూములను గుర్తించి వెంటనే స్వాధీనం చేససుకోవాలని, ప్రతినెలా అర్చకులకు జీతం ఇవ్వాలని, ఎస్సారెస్పీ రెండోదశ కాల్వ నిర్మాణంతో నష్టపోయినా దేవాలయ భూమికి ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని దేవాలయ అభివృద్ధికి కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి కందగట్ల ఆలయ భూమిని (630 ఎకరాలు) సర్వే చేయించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆలయం మూతపడకుండా రోజువారీ పూజాదికాలు జరిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అధికారులు పట్టించుకుంటలేరు
మా గ్రామంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. గుడి అభివృద్ధి గురించి అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఆలయ భూమిని ఎన్నో ఏళ్లుగా కొందరు కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నారు. ఆ కౌలు ఎటుపోతుందో ఈవోకు, రెవెన్యూ అధికారులకు కూడా తెలియదు.
-ముద్దం సైదిరెడ్డి, కందగట్ల
ఆమడ దూరంలో గుడి అభివృద్ధి
నాకు తెలిసి 21 సంవత్సరాలుగా గుడి అభివృద్ధిలో వెనుకబడింది. ఎంతో మంది పాలకులు వస్తూ.. పోతున్నా మా ఊరిలోని గుడి మాత్రం అభివృద్ధి కావడం లేదు. దీనికి ఉన్న 630 ఎకరాల భూమి ఎటుపోయిందో తెలియదు. నడి ఊరిలో ఉన్న గుడి పూజలకు నోచుకోవడం లేదు. పూజారికి వేతనం లేదు. గుడిలో ధూప దీప నైవేద్య కార్యక్రమాలు కొనసాగేలా చూడాలి.
-గుమ్మడవెల్లి మల్లయ్య, కందగట్ల