తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. అన్ని రంగాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తున్న రాష్ట్ర వైభవాన్ని నలుదిశలా చాటేలా కార్యాచరణ రూపొందించారు. జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం మొదలుకొని 22 వ తేదీ వరకు నిరాటంకంగా 21 రోజులపాటు విభిన్న రీతిలో కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక రూపంలో భాగస్వాములు కానున్నారు. ఒక్కోరోజు ఒక్కో విభాగం వారీగా తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు. గ్రామాలు, పట్టణాల్లో నాటి- నేటి పరిస్థితుల్లో తేడాలతోపాటు విద్య, వైద్యం, మౌలిక వసతులకు ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధుల గురించి వివరించనున్నారు. సకల జనుల సంక్షేమం, రైతన్న సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సారథ్యంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల స్థాయిలో నిర్వహణపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. బుధవారం అన్ని నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరుపాలని, రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలకు చాటి చెప్పడమే ధ్యేయంగా సమన్వయంతో ముందుకు సాగుదామని నిర్దేశించారు. శుక్రవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున నల్లగొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, యాదాద్రి భువనగిరిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవ సందేశాన్ని
ఇవ్వడంతో పదేండ్ల పండుగ షురూ కానున్నది.– నల్లగొండ ప్రతినిధి, మే31(నమస్తే తెలంగాణ)
రేపటి ఆవిర్భావ దినోత్సవం నుంచి మొదలుకుని ఈ నెల 22 వరకు అమరుల సంస్మరణ వరకు నిరాటకంగా 21 రోజుల పాటు విభిన్న రీతిలో కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక రూపంలో భాగస్వాములు కానున్నారు.