నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్23(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ను ప్రజలనుంచి దూరం చేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని బూటకపు ప్రచారం చేశారని, పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రేవంత్రెడ్డి సర్కార్ చెంప చెళ్లుమనిపించేలా ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. కాళేశ్వరంలో రెండు పిల్లర్లలో పగుళ్ల వస్తే… ఏకంగా కూలిపోయిందని గోబెల్స్ ప్రచారం చేస్తూ కేసీఆర్, హరీశ్రావును బద్నాం చేయాలని చూశారని మండిపడ్డారు. అయితే హైకోర్టు ఘోష్ కమిషన్ నివేదిక అంతా ట్రాష్ అని తేల్చిందన్నారు. గురువారం నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్కుమార్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ బుధవారం హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ కుట్రలకు చెక్ పెట్టేలా తీర్పు వచ్చిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేడిగడ్డ బరాజ్ కూలిపోయిందనే ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. తర్వాత పీసీ ఘోష్ కమిషన్ పేరుతో కేసీఆర్, హరీశ్రావులపై అభియోగం మోపి బద్నాం చేసే యత్నం చేశారన్నారు. గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్రిప్ట్నే పీసీ ఘోష్ నివేదిక రూపంలో ఇచ్చారన్నారు. నాడు బీఆర్ఎస్ చెప్పిందే… హైకోర్టు నిర్ధారించిందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఆరు గ్యారంటీలను గాలికి వదిలి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకి చెంప పెట్టులాంటి తీర్పు హైకోర్టు ఇచ్చిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్ట్కు రోజూ 0.5 టీఎంసీల నీరు రావాలని, కానీ వట్టెం నుంచి డిండికి నీరు వచ్చే కాల్వ ఎత్తు పెంచడం వల్ల జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
జిల్లా నుంచి సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 230 టీఎంసీల నీరు అందుబాటులో ఉండేలా కాళేశ్వరం నిర్మాణం జరిగిందని, తెలంగాణ రైతాంగానికి సగం సాగునీరు అందేలా కేసీఆర్ కాళేశ్వరం రూపొందించారన్నారు. కాళేశ్వరం నిజంగా కూలిపోతే గంధమల్ల నుంచీ ఆలేరు ఎమ్మెల్యే నీళ్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్కు చెంప పెట్టులా హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టు అన్నారు. పంట కొనుగోళ్లు లేవని, కరెంట్ రాదని, యూరియా దొరకదని, రైతులను గాలికి వదిలేశారన్నారు.
రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా ఉంటామని,. త్వరలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిరంజన్ వలీ, మాజీ మున్సిఫల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ బ్రహ్మణ పరిషత్ సభ్యులు చకిలం అనిల్కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కార్పొరేటర్లు మారగోని గణేష్, దొడ్డి రమేష్, దీప్లా నాయక్, పెరిక యాదయ్య, కుందురు ప్రవీణ్కుమార్రెడ్డి, బీఆర్ఎస్ నాయకలు సింగం రాంమోహన్, వంగాల సహదేవ్రెడ్డి, కొండూరు సత్యనారాయణ, పల్లె రంజిత్కుమార్, తుమ్మల లింగస్వామి, లోడంగి గోవర్ధన్, దేప వెంకట్రెడ్డి, ఐతగోని యాదయ్య, దండెంపల్లి సత్తయ్య తదితరులు ఉన్నారు.