యాదాద్రి, డిసెంబర్4: పేదలకు ఉచితంగా వైద్యం, విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట మండలం మహబూబ్పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన సిద్దులు, ఎల్లంల మల్లయ్య, సోకం మల్లయ్య ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్ నాయకులు గుట్ట పట్టణంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మహేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రత్యేక చొరవతో చరిత్రలో నిలిచే విధంగా యాదగిరిగుట్ట పట్టణంలో 100 పడకల దవాఖాన మంజూరయ్యిందని తెలిపారు.
నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించేందుకు సీడీపీ నిధుల్లో 40 శాతం కేటాయించామని స్పష్టం చేశారు. ఆలేరు పట్టణంలో తమ సొంత డబ్బులతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు లబ్ధి పొందుతున్నారని, మరింత మందికి సైతం డయాలసిస్ను అందించాలన్న లక్ష్యంతో రాబోవు రోజుల్లో సెంటర్ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జైన్ ట్రస్ట్తో సంప్రదించామని, వారు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఎంతో మంది నాయకులు వచ్చారు కానీ, ఏ ఒక్కరూ సీఎం కేసీఆర్లా ముందుకు వచ్చి యాదాద్రిని ఇంత గొప్పగా పునర్నిర్మించాలన్న ఆలోచన చేయలేదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి ఆలేరులో తావులేదని తెలిపారు. ఎంతో మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. రాబోవు రోజుల్లో చేరికల పరంపర కొనసాగుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, రైతుబంధు సమితి సభ్యుడు మిట్ట వెంకటయ్య, మహబూబ్పేట సర్పంచ్ ఆరె స్వరూపామల్లేశ్గౌడ్, మాజీ సర్పంచ్ కందడి రంగారెడ్డి, పీఏసీఎస్ డైరక్టర్ ఆరె రమేశ్గౌడ్, ఉప సర్పంచ్ ప్రభాకర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గాజుల రఘుపతి, సోషల్ మీడియా కన్వీనర్ భరత్ ముదిరాజ్ పాల్గొన్నారు.