ఎప్పుడెప్పుడా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8గంటల నుంచి నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి పట్టణాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు. లెక్కింపు కోసం ఒక్కో
నియోజకవర్గానికి 14టేబుళ్లు ఏర్పాటు చేశారు.
రౌండ్ల వారీగా ఆయా నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈవీఎంలు కావడంతో ప్రతి 15నుంచి 20 నిమిషాలకో రౌండ్ ఫలితం తెలిసే అవకాశం ఉన్నది. ఉదయం 8:45 గంటల వరకు ప్రతి నియోజకవర్గంలోని తొలి రౌండ్ ఫలితం వెల్లడి కావచ్చని అంచనా. గంటకు 3నుంచి 4 రౌండ్ల ఫలితాలు రానుండగా.. ఉదయం 11 గంటలకు ఫలితాల సరళి స్పష్టం కానుంది. మధ్యాహ్నం 2గంటల వరకు తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. నల్లగొండలో 6, సూర్యాపేటలో 4, భువనగిరిలో 2 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇందుకోసం నల్లగొండలో మిర్యాలగూడ రోడ్డులోని అనిశెట్టి దుప్పలపల్లి సమీప గోదాముల్లో, సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో,
భువనగిరిలో అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధ్దమైంది. పటిష్ట బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు జరుగనుండగా.. ఎన్నికల కమిషన్ అనుమతితో జారీ అయిన పాస్లు ఉన్న అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో కట్టుదిట్టమైన మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్2 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ఫలితం నేడు తేలనుంది. నల్లగొండ జిల్లాలోని 6 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రంలో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిర్యాలగూడ రోడ్డులోని అనిశెట్టి దుప్పలపల్లి సమీపంలో ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు రౌండ్ల వారీగా నియోజకవర్గాల వారీగా వేర్వేరుగా నిర్వహిస్తారు.
ప్రతి 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో ఒక రౌండ్ ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. 8 గంటలకు మొదలయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియ గరిష్టంగా మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తవుతుందని అంచనా. జిల్లాలో నల్లగొండతోపాటు మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఆరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఒక్క చోటనే జరుగనుంది. ఎన్నికల కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ పూర్తి చేశారు. వీరికి ర్యాండం పద్ధతిలో శనివారం విధులను కేటాయించారు. వీరంతా ఉదయం 6 గంటల వరకే విధుల్లో ఉండాల్సిందిగా ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంలోనే అల్పాహారం, భోజనం, టీ, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఒక్కో నియోజకవర్గంలోని కౌంటింగ్ హాల్లో మొత్తం 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. అదనంగా పోస్టల్ బ్యాలెట్లకు, సర్వీస్ ఓట్ల లెక్కింపునకు టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. రిటర్నింగ్ అధికారికి మరో టేబుల్ ఉంటుంది. ఈ 14 టేబుళ్ల పై 14 బూత్ల ఈవీఎంలను ఉంచి ఒకేసారి ఓట్లు లెక్కిస్తారు. మొత్తం కలిపి ఒక రౌండ్ ఫలితంగా ప్రకటిస్తారు. ఆ విధంగా దేవరకొండలో 310 పోలింగ్ బూత్లు ఉండగా 23 రౌండ్లల్లో తుది ఫలితం వెల్లడి కానుంది.
299 పోలింగ్ కేంద్రాలున్న నాగార్జునసాగర్ నియోజకవర్గ తుది ఫలితం 22 రౌండ్లలో.. మిర్యాలగూడ (263 పోలింగ్ కేంద్రాలు) 19 రౌండ్లు, నల్లగొండ (284) 21 రౌండ్లలో తేలనుంది. మునుగోడులో 307 పోలింగ్ బూత్లు ఉండగా 22 రౌండ్లలో.. 305 పోలింగ్ కేంద్రాలు ఉన్న నకిరేకల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం 22 రౌండ్లలో తేలనుంది. మొత్తం జిల్లాలోని 144 మంది అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నం 2 గంటల వరకే దాదాపుగా వెల్లడయ్యే అవకాశం ఉంది. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్న నియోజకవర్గాల ఫలితాలు కొంత తొందరగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓట్ల లెక్కింపును పకడ్బందీగా, ప్రశాంతంగా పూర్తి చేసేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణలో కేంద్ర బలగాలు కాపలా కాస్తున్నాయి. దాంతో పాటు కౌంటింగ్ కేంద్రం వద్ద మూడెంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లోనూ ఆంక్షలు ఏర్పాటు చేశారు. పటాకులు కాల్చేందుకు అనుమతి లేదు. ఆదివారం సాయంత్రం వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగనుంది. కౌంటింగ్కు వచ్చే అభ్యర్థులు, వారి ఏజెంట్ల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలను సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాస్ ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిసేందుకు అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహకరించాలని జిల్లా ఎస్పీ అపూర్వరావు కోరారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్, రిటర్నింగ్ అధికారి, అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ను ఓపెన్ చేస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ హాల్లో తీసుకువస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు టేబుళ్లపై ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలుపెట్టాక ఆ వెంటే ఐదు, పది నిమిషాల తేడాతోనే తొలిరౌండ్ ఈవీఎంల లెక్కింపును కూడా ప్రారంభిస్తారు. దాంతో తొలి ఫలితం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్య రావచ్చని అంచనా. తర్వాత ప్రతి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో ఒక రౌండ్ లెక్కింపు పూర్తి కానుందని తెలుస్తోంది.
ఒక్కో రౌండ్లో ఒక్కో నియోజకవర్గానికి చెందిన 10 వేల నుంచి 12 వేల వరకు ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. అయితే కంట్రోల్ యూనిట్లో బటన్ నొక్కితే ఎవరికి ఎన్ని ఓట్లు అనేది నిమిషాల్లోనే స్పష్టమైనా.. అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను నోట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోనుంది. మొత్తం అభ్యర్థుల ఓట్లతో పాటు నోటాకు వచ్చిన ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫలితం స్పష్టమైనా… ఆర్ఓ సంతకంతో పాటు ఎన్నికల పరిశీలకుని ఆమోదం కూడా లభిస్తేనే అది అధికారికంగా బయటకు వెల్లడిస్తారు. ఇదంతా జరుగాలంటే కనీసం 30 నిమిషాలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక చివరలో వీవీప్యాట్ స్లిప్స్ను కూడా లెక్కించాల్సి ఉంటుంది. మొత్తం ఈవీఎంల నంబర్లతో డ్రా వేసి అందులోంచి ఏవేనీ ఐదు ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్స్ను ఎంపిక చేస్తారు. వీటిని కౌంట్ చేశాక… సంబంధిత ఈవీఎంలో వచ్చిన ఓట్ల లెక్కింపుతో సరిసమానం అయ్యాయా లేదా అని చూస్తారు. ఇదంతా పూర్తయ్యాకే అధికారికంగా విజేతను ప్రకటించనున్నారు.