అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం కీలక దశకు చేరుకున్నది. ఈ నెల 3న మొదలైన నామినేషన్ల స్వీకరణ 10వ తేదీన ముగియనున్నది. దాంతో ఇవ్వాల, రేపు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులంతా గురువారం నామినేషన్ల దాఖలుకు సిద్ధమయ్యారు. సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ వేయనున్నారు. ఇతర అభ్యర్థులు కూడా ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
నల్లగొండ, నకిరేకల్, నాగార్జునసాగర్లో సీఎం సభలు ఉన్న నేపథ్యంలో సాదాసీదాగా, మిగతా చోట్ల ర్యాలీలతో
నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ బుధవారం భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. భువనగిరిలో నేడు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, రేపు ఆలేరులో ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్లకు రెండు రోజులు గడువు ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఓ వైపు ఎన్నికల ప్రచారం.. మరోవైపు పార్టీలో చేరికలపై దృష్టి సారించిన బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ల దాఖలుపై దృష్టి సారించారు. గురువారం శుభ దినం కావడంతోపాటు అధినేత కేసీఆర్ కూడా నేడు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని అభ్యర్థులంతా తమ నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. నేడు ఉదయం 11నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో నామినేషన్ వేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఆయా నియోజకవర్గాల్లోని కీలక నేతలంతా నామినేషన్ కార్యక్రమాల్లో భాగస్వాములు కానున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు స్వచ్ఛందంగా తరలి రానుండడంతో ఎస్వీ డిగ్రీ కళాశాల ఏరియా నుంచి పాదయాత్రగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి మంత్రి ప్రసంగించనున్నారు. తుంగతుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్కుమార్ అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నామినేషన్కు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి హంగామా లేకుండా పార్టీ ముఖ్య నేతలతోనే నామినేషన్ వేయనున్నారు. హుజూర్నగర్ గణపతి ఆలయంలో పూజల అనంతరం భారీ ర్యాలీతో నామినేషన్కు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సిద్ధమయ్యారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి భాగస్వాములు కానున్నట్లు తెలిపారు. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ బుధవారం భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కోదాడలో బీఆర్ఎస్ శ్రేణుల సందడి నెలకొంది.
మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు గురువారం నామినేషన్ వేయనున్నారు. ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్లోని అమరవీరుల స్థూపం నుంచి ర్యాలీగా ఆర్వో కార్యాలయం వరకు వెళ్లనున్నారు. నామినేషన్ అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించనున్నారు. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఇప్పటికే సాదాసీదాగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
నేడు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీతో మరో సెట్ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి అంగడిపేట నుంచి భారీ ర్యాలీగా తరలివెళ్లి చండూరు తాసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. భువనగిరిలో పైళ్ల శేఖర్రెడ్డి కూడా నేడు నామినేషన్ వేయనున్నారు. సాయిబాబా ఆలయంలో పూజల అనంతరం భారీ ర్యాలీతో ఆర్వో కార్యాలయానికి చేరుకుంటారు.
నల్లగొండ జిల్లాలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బహిరంగ సభలు ఉన్న నియోజకవర్గాల్లో సాదాసీదాగా నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ముఖ్య నేతలతో కలిసి నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 20న అధినేత కేసీఆర్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సాదాసీదాగా నామినేషన్ వేయనున్నారు. నకిరేకల్లో ఈ నెల 20న కేసీఆర్ మీటింగ్ ఉండడంతో ఇక్కడ కూడా చిరుమర్తి లింగయ్య ఎటువంటి హడావుడి లేకుండా ముఖ్య నేతలతో కలిసి నామినేషన్ వేయాలని నిర్ణయించారు.
నాగార్జునసాగర్లో ఈ నెల 14న అధినేత కేసీఆర్ బహిరంగ సభ ఉండగా.. నోముల భగత్కుమార్ సింపుల్గా నామినేషన్ వేయనున్నారు. పార్టీ ముఖ్యులతో కలిసి నిడమనూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆలేరులో ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుక్రవారం అధికారికంగా హంగామా లేకుండా ముఖ్య నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రెండు సెట్ల నామినేషన్లను సునీత తరఫున పార్టీ నేతలు దాఖలు చేశారు.
నామినేషన్ల దాఖలుకు ఇవ్వాళ, రేపు మాత్రమే గడువు ఉంది. ఈ రెండ్రోజులు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో భారీ సందడి నెలకొననుంది. కాంగ్రెస్కు సంబంధించి నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దేవరకొండలో నేనావత్ బాలూనాయక్, భువనగిరిలో కుంభం అనిల్కుమార్రెడ్డి మాత్రమే ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేశారు. మిగతా వారంతా ఇవ్వాళ, రేపు వేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.