కాంగ్రెస్ పార్టీలో భువనగిరి బీసీలకు మొండి చెయ్యే మిగిలింది. నియోజకవర్గ నేతలకు పరాభవం ఎదురైంది. మొదటి నుంచీ టికెట్ ఆశించిన బీసీ నాయకులకు కాంగ్రెస్ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. బీసీలకు కాకుండా ఓసీకి టికెట్ ఖరారు చేసింది. డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్రెడ్డి అభ్యర్థిత్వం ఫైనల్ చేసింది. దాంతో బీసీ నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో సహకరించేది లేదని కుండబద్ధలు కొడుతున్నారు. తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : భువనగిరి నియోజకవర్గంలో కొంత కాలంగా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరికి వారే యమున తీరు అన్న చందంగా పార్టీ మా రింది. పార్టీ కార్యక్రమాలు సైతం వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దీంతో కేడర్ సైతం గందరగోళంలో కొట్టుమిట్టడుతున్నది. అయితే ఎన్నికల నేపథ్యంలో పలువురు టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. అందుకోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేశార.
అయితే ఉదయపూర్ డిక్లరేషన్లో భాగ ంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో భువనగిరి టికెట్ బీసీలకు ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పంజాల రామాంజనేయులు గౌడ్, పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ టికెట్ ఆశించారు. క్షేత్ర స్థాయిలో జోరుగా సమావేశాలు నిర్వహించారు. ఇదే సమయంలో కుంభం పార్టీ మారడంతో లైన్ క్లియర్ అయ్యిందని అంతా భావించారు. కానీ కుంభం సొంతగూటికి రావడంతో బీసీ నేతల ఆశలకు నీళ్లు చల్లినట్లు అయ్యింది. తన లాబీతో కుంభం టికెట్ దక్కించుకున్నారు.
కుంభం అనిల్కుమార్రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం బీసీ నేతలకు అన్యాయం చేశారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. తన ఇష్టానికి వేరే పార్టీలో చేరి, పదవి కాంక్షతో మళ్లీ కాంగ్రెస్లో చేరాడని మండిపడుతున్నారు. ఆయనకు పదవి యావే తప్ప.. పార్టీ బలోపేతం, కార్యకర్తల అవసరం లేర ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బీసీల ఎదుగుదలకు అడ్డం వస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఎన్నికల్లో ఆయనకు సహకరించబోమని కుండబద్దలు కొడుతున్నారు.
తామే దగ్గర ఉండి.. కుంభం అనిల్కుమార్ రెడ్డిని ఓడిస్తామని ప్రతిన బూ నుతున్నారు. త్వరలో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కీలక నేతల సమావేశంలోనూ ఇదే స్పష్టం చేశారు.